breaking news
Puskaras end
-
పులకించిన అమరావతి
సాయంత్రం కళాకారులతో భారీ ర్యాలీ మంగళ హారతితో ముగిసిన కార్యక్రమాలు సాక్షి, అమరావతి : అమరావతిలో పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. అమరలింగేశ్వర స్వామిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. జిల్లాలో పుష్కర స్నానాలు చేసినవారిలో దాదాపు సగం మంది ఇక్కడే పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలోని 70 ఘాట్లలో పుష్కరాల 12 రోజుల్లో 61,06,641 మంది పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో అమరావతిలోనే 29.62 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని వివరించారు. పుష్కరాల 12వ రోజు అమరావతిలో బుద్ధ విగ్రహం నుంచి హారతి ఇచ్చే అమరలింగేశ్వరుని స్వామి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. హారతి సమయంలో బాణసంచా పేల్చుతూ.. పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దాతల సేవలు మరువలేనివి... పుష్కరాల 12 రోజులు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పుష్కర భక్తులకు చేసిన సేవలు వెలకట్టలేనివి. రోడ్డు వెంబడి ఉండే గ్రామాల ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఉచిత అన్న ప్రసాదాలు, తాగునీరు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా దాతలు ఏర్పాట్లు చేశారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కళ్లం హరినాథరెడ్డి ఆధ్వర్యంలో సేవాభారతి పేరుతో భక్తులకు విశేష సేవలు అందించారు. రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్, సత్యసాయి సేవా సంస్థ, ప్రజాపిత బ్రహ్మకుమారిలు, శ్రీవారి సేవకులు, బ్రాహ్మణ సేవా సంస్థ, శ్రీరామ భక్త సేవా సమితి, రైస్మిల్లర్స్ అసోషియేషన్, మౌర్య క్యాటరింగ్ అధినేత పి.సుబ్రమణ్యంతో పాటు పలువురు స్వచ్ఛందంగా లక్షల మందికి ఉచిత అన్న ప్రసాదాలు అందించారు. ఘాట్లను శుభ్రంగా ఉంచడంతో పాటు, దేవాలయాల్లో క్యూలైన్ వద్ద మంచినీరు అందించడం వంటి కార్యక్రమాల్లో సేవా సంస్థలు కీలకపాత్ర పోషించాయి. పుష్కర విధుల్లో... పుష్కర విధుల్లో అన్ని శాఖల అధికారులు అమరావతిలోనే ఉండి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎప్పటికప్పుడు ఘాట్లను పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గుంటూరు కమిషనర్ నాగలక్ష్మి, డీసీపీ శ్రీదేవి, జెడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఎంహెచ్వో పద్మజ, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీహరి, డీఎస్వో చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల ముగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 12వ రోజుతో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోనూ ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లను చేసింది. సంగమం ఘాట్ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్ ఘాట్లలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలు అఖరి రోజు కావడంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు భారీసంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలో సంగమం, పద్మావతి, కృష్ణవేణి, వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరులో అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. నల్లగొండ జిల్లాలో మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ ఘాట్లలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది.