breaking news
muppalla Viewing
-
ప్రత్యేక హోదా కల్పించకపోవడం దారుణం
పాతగుంటూరు: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజనచట్టం అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై శనివారం పలు పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ల మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం విభజన సమయంలో ఐదు సంవత్సరాలు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన సందర్భాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఐదేళ్లు చాలదు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని అప్పట్లో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పడం, కేంద్ర మంత్రి సుజనాచౌదరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నిధులు అధిక మొత్తంలో వస్తాయని చెప్పడం రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. దీనిపై సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తుంటే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సీపీఐ కృషి చేస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు మద్దతు ఇస్తూ ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాట మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలు ప్రభుత్వం స్వీకరించిందని, ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకుండా ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వారిచ్చే డబ్బులతో అభివృద్ధి చేసేలా చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వామపక్షాలు, ప్రతిపక్షం, ప్రజా సంఘాలు కలసికట్టుగా ప్రజా సమస్యలపై, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు విభజన చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేక మౌనం దాలుస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా రైతులు, ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను వెలుగులోకి తెచ్చి పోలవరంను నిర్వీర్యం చేసేలా చూస్తుందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఉద్యమంలో పాల్గొంటామన్నారు. సమావేశంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి తూమాటి శివయ్య, సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పున్నయ్య, లోక్సత్తా జిల్లా జాయింట్ సెక్రటరీ జి.వెంకయ్య, లోక్సత్తా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎస్.మనోరమ, అయ్యస్వామి, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణమూర్తి, సుబ్బారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజాగ్రహం తప్పదు
అనంతపురం టౌన్ : విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ఇతర హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బడ్జెట్లో జిల్లాకు అన్యాయం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకుల అరెస్టును నిరసిస్తూ ఆదివారం విపక్షాల ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో ఆందోళన చేసిన సీపీఐ నేతలను అరెస్టు చేసి జైలులో పెట్టడం దారుణమన్నారు. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. విభజన బిల్లుపై చర్చ సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని ప్రతిపక్షంలో ఉండి వెంకయ్యనాయుడు కోరానన్నారు. అధికారంలోకి రాగానే మాటమార్చారని మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టుకుకేవలం రూ.100 కోట్లు కేటాయించడం తెలుగు ప్రజలను అవమానించడమేనన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వెనుబడిన రాయలసీమ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబునాయుడు ఒత్తిడి తేవడం మానేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న సీపీఐ నేతల అరెస్టు అన్యాయమని శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వాకౌట్ చేశారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్పపాడు హుసేన్ పీరా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి, నగర కమిటీ యవజన అధ్యక్షుడు మారుతీనాయుడు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. కేసులు పెట్టి ఉద్యామన్ని అణచలేరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచలేరని స్పష్టం చేశారు. సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రాజధాని పేరుతో ప్రభుత్వం వ్యాపారం చేయడంపై చూపించే శ్రద్ధ రాష్ట్ర సంక్షేమంపై చూపడం లేదని ధ్వజమెత్తారు.