breaking news
job assurance
-
తల్లి చేయని మేలు చేస్తోన్న ‘సీడాప్’
కర్నూలు (ఓల్డ్సిటీ): తల్లిదండ్రులు చేయలేని పనిని ఆ సంస్థ చేసిచూపిస్తోంది.. పిల్లల పోషణ, పెంపకం, విద్యా బుద్ధులు నేర్పడం వరకే సాధ్యమవుతుందేమో కానీ వారు తమ పిల్లలను ఉద్యోగాలకు ఎంపికయ్యేంత నేర్పరితనాన్ని మాత్రం నూరిపోయలేరు. అలాంటి కఠినమైన పాత్రను ఆ సంస్థ పోషిస్తోంది. అంతే కాదు.. ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇప్పిస్తోంది. ఇంతకూ ఆ సంస్థ పేరు ఏమిటని అనుకుంటున్నారా.. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్). జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. గ్రామీణ నిరుద్యోగుల భవిష్యత్తుకు బాటలు.. పల్లె ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకుల భవితకు బాటలు వేయాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూ–జీకేవై) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా చేరి డీఆర్డీఏ ఆధ్వర్యంలో సీడాప్ సంస్థను స్వయంగా నడిపిస్తోంది. రాష్ట్రంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. 2008లో కర్నూలులో స్థాపించారు. ఆతర్వాత ఎమ్మిగనూరులోనూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఈ రెండు చోట్లా శిక్షణలు కొనసాగుతున్నాయి. బ్యాచీకి 35 మంది చొప్పున కర్నూలులో రెండు బ్యాచీలు, ఎమ్మిగనూరులో ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నారు. శిక్షణ కాలపరిమితి 90 రోజులు. కుములేటివ్ ఇంగ్లీష్, రిటైల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్, సాఫ్ట్ స్కిల్స్, టైపింగ్ వంటి నేర్పిస్తారు. ఇక్కడి ఫ్యాకల్టీ ఇతరుల పట్ల గౌరవ భావం, సౌమ్యంగా మాట్లాడే విధానం నేర్పడంతో పాటు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంటికంటే మెరుగైన సదుపాయాలు.. ఆ సంస్థలో చేరిన యువతీ యువకులకు మూడు పూటలా చక్కటి భోజనంతో పాటు సాయంత్రం పూట స్నాక్స్ కూడా అందిస్తారు. ఆహారం తయారీదారులు పౌష్ఠిక విలువలు, రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. ఆహార వడ్డింపును సీడాప్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వారు సూచించిన మెనూ ప్రకారమే ఆహారాన్ని అందిస్తారు. శిక్షణలో చేరగానే మొదట రెండు జతల యూనిఫాంతో పాటు ఒక జత షూస్, సాక్స్లు ఇస్తారు. తరగతిలో హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉంటుంది. బస చేసేందుకు యువతులకు, యువకులకు వేర్వేరు గదులను ఏర్పాటు చేశారు. నిద్రించేందుకు నాణ్యమైన పరుపులు కూడా ఉంటాయి. సంస్థ జేడీఎం కిరణ్ సంస్థను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. శిలను శిల్పం చేసిన సీడాప్.. చిత్రంలో కనిపిస్తున్న యువతి పేరు సువర్చల. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామ రైతు ఎర్రపోగు మోహన్ కూతురు. ఇంటర్ వరకు చదువుకుంది. వీరిది నిరుపేద కుటుంబం. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. ఇలాంటి తరుణంలో జాబ్ రీసోర్స్ పర్సన్ ద్వారా సీడాప్ సంస్థ గురించి తెలుసుకుంది. 2020 జనవరిలో సీడాప్ సంస్థలో చేరి 90 రోజుల శిక్షణ చేసింది. శిలను శిల్పంగా మార్చే చందంగా ఈ సంస్థలో ఫ్యాకల్టీ చక్కటి తర్ఫీదు ఇచ్చారు. క్యుములేటివ్ ఇంగ్లీష్, రిటైల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్, సాఫ్ట్ స్కిల్స్, టైపింగ్ వంటి నేర్పించారు. ఇతరులను ఎలా గౌరవించాలి, సౌమ్యంగా మాట్లాడే విధానాన్నీ నేర్పారు. ట్రైనింగ్ పూర్తి కాగానే ఆమెను హైదరాబాదులోని లలిత జువెల్లర్స్ షోరూమ్ వారు సేల్స్ రంగంలో ఉద్యోగం ఇచ్చారు. మొదట జీతం 12,500 రూపాయలు ఉండేది. సంవత్సర కాలంలోనే ప్రతిభ చూపించి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పదోన్నతి పొందింది. ప్రస్తుతం ఆమె జీతం (ఇన్సెంటివ్లతో కల్పుకుని) నెలకు రూ. 35 వేలు పైమాటే. కుటుంబానికి ఆర్థిక బాసటగా నిలిపిన సీడాప్ సంస్థ రుణం తీర్చుకోలేనిదని ఆమె పేర్కొంటున్నారు. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతోంది ఈమె పేరు శాంతమ్మ. పాములపాడు మండలం వానాల గ్రామ రైతు కుటుంబానికి చెందిన ఈ యువతి ఐదేళ్ల క్రితమే ఇంటర్ పూర్తి చేసింది. వ్యవసాయ రంగంలో ఒడిదుడుకుల కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. తాను ఉన్నత చదువులు చదువుకోలేదు, తనకు ఎవరు ఉద్యోగమిస్తారంటూ తరచూ ఆందోళనకు గురయ్యేది. ఆనోటా ఈనోటా సీడాప్ సంస్థ గురించి తెలుసుకుంది. అప్పట్లో 75 రోజుల శిక్షణ ఉండేది. సంస్థలో చేరి శిక్షణ పూర్తి చేసుకుంది. హైదరాబాదులోని డీమార్ట్ స్టోర్స్లో సీఎస్ఏగా ఉద్యోగం పొందింది. చేరినప్పుడు జీతం కేవలం రూ. 8,000 ఉండేది. ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణ, ఖచ్చితత్వం, అంకితభావం వంటి గుణాలను చూసి యాజమాన్యం ఆమెకు పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు నగరంలోని డీమార్ట్ షోరూమ్లో ఫ్లోర్ ఇంచార్జి. ఈమె జీతం అక్షరాలా రూ. 38 వేలు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే కాక ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను కూడా నెరవేర్చుకుంటానని చెబుతోంది. తొలగుతున్న నిరుద్యోగ సమస్య: బి.కె.వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్డీఏ కొత్త ప్రభుత్వం వచ్చాక వలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ప్రజా పంపిణీ సరుకుల వాహనాలు వంటి వాటి ద్వారా దాదాపుగా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగస్తులు అయ్యారు. కాగా సీడాప్ ద్వారా కొనసాగుతున్న ఉద్యోగ కల్పన ప్రక్రియ ద్వారా ఏడాదికి 420 మంది వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులుగా మారుతున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా నిరుద్యోగులు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు అయ్యారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. -
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు!
తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వాగ్దానం చేయలేదని అసెంబ్లీ సాక్షిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తాము నైపుణ్యాభివృద్ధి చేస్తామన్నామే తప్ప.. ఎక్కడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తారు. సీఆర్డీఏ చట్టంలో ఏవేం వాగ్దానాలు చేశారో చూడాలని, వాటిలో ఏ ఒక్కటీ ఈరోజు వరకు నెరవేర్చలేదని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముందు చెప్పి, ఇప్పుడు ఆ వాగ్దానం ఇవ్వలేదని చెప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి 30 వేల ఎకరాల భూములిచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సోమవారం కూడా సభలో చెప్పారని, కానీ.. రైతులు పొలాలు పోయి, వ్యవసాయం గానీ ఉపాధి గానీ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా అర్హులైన యువతీ యువకులు ఉంటే వాళ్లలోంచి తొలి దశ కింద 113 మందిని మాత్రమే ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారని.. కానీ రూపాయి కూడా స్టైపండ్ ఇవ్వలేదు, కనీసం బస్సు చార్జీలు కూడా ఇవ్వలేదని అన్నారు. వాళ్లు సీఆర్డీఏ ఆఫీసుకు వచ్చి, తాము బయట ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చామని, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని అడిగితే పోలీసులతో బలవంతంగా కొట్టించి పంపారని తెలిపారు. చివరకు ప్రభుత్వం తాను చెప్పిన పనులు చేయడం లేదన్న ఆవేదనతో అక్కడ ఓ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాజీనామా కూడా చేశారన్నారు. ఇప్పుడు అసలు వాగ్దానమే చేయలేదనడం అన్యాయమని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో యువతీ యువకులకు కనీసం సిమెంటు బొచ్చెలు మోసే పనికూడా ఇవ్వకపోవడం దారుణమని, కనీసం పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో వాళ్లకు 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.