breaking news
ibrahimpatan
-
హైకమాండ్పై మల్లేష్ ఫైర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పార్టీకి షాక్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడం లేదనే సంకేతాల నేపథ్యంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఇబ్రహీంపట్నం శాసనసభ స్థానం టికెట్ను ఆశిస్తున్న ఆయనకు ఢిల్లీ పరిణామాలు నిరాశజనకంగా కనిపించడంతో పార్టీ హైకమాండ్పై తిరుగుబాటు చేశారు. బుధవారం తన నివాసంలో సన్నిహితులతో మంతనాలు జరిపిన ఆయన ఈ నెల 17న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. టికెట్లు అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ పెద్దల అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో వాటిని బయటపెడతానన్నారు. టికెట్ల కేటాయింపులో బీసీ సామాజికవర్గానికి తీరని అన్యాయం చేశారని, గొల్ల, కురుమలకు కేవలం ఒకే సీటును కేటాయించడమేమిటని నిలదీశారు. పార్టీకి వ్యతిరేకంగా తన సామాజికవర్గాన్ని ఏకం చేస్తానని హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీ ప్లీనరీని ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తనకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాగా, గత ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన మల్లేశ్ ఇబ్రహీంపట్నం సీటు తనకే దక్కుతుందనే ధీమాతో పనిచేశారు. అంతేగాకుండా రాజకీయ గురువు, కర్ణాటక మాజీ సీఎం సిద్ధిరామయ్య ఆశీస్సులు కూడా ఉండడం కలిసివస్తుందని అంచనా వేశారు. అయితే, అనూహ్యంగా ఈ సీటును మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. నాలుగైదు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి పరిణామాలను గమనించిన ఆయన బుధవారం ఉదయం నగరానికి చేరుకున్న వెంటనే కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హస్తినలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, టికెట్కు కత్తెర పెడుతున్న అంశాన్ని వారితో చర్చించి.. ఇండిపెండెంట్గా బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీనికి ఆయన సన్నిహితుల నుంచి సానుకూల స్పందన రావడంతో పార్టీ హైకమాండ్పై ధిక్కార స్వరం వినిపించారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ మల్రెడ్డి బ్రదర్స్లో ఒకరు రెబల్గా బరిలో దిగగా.. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమవుతుండడం గమనార్హం. చంద్రశేఖర్ రాజీనామా మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్న ఆయన.. నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని వీడిన చంద్రశేఖర్ను అక్కున చేర్చుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్ స్థానిక నాయకత్వం అనుకూలంగా ఉన్నా అధిష్టానం నుంచి స్పష్టత రాకపోవడంతో ఆయన చేరికకు అడ్డుగా మారింది. బీజేపీలో చేరడం వల్ల మైనార్టీ ఓట్లకు గండిపడే అవకాశముందని భావిస్తున్న చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడమే మంచిదనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఈ ఘనత మాదే
కృష్ణా–గోదావరి సంగమంపై సీఎం చంద్రబాబు నదీమ తల్లులకు ప్రత్యేక పూజలు నవ హారతి సభకు వచ్చేందుకు నిరాకరించిన డ్వాక్రా మహిళలు ఇంజినీరింగ్ విద్యార్థుల తరలింపు ముఖ్యమంత్రి రాక ఆలస్యంతో వారూ జంప్ ఇబ్రహీంపట్నం : కృష్ణా,గోదావరి నదుల అనుసంధాన ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సంగమ ప్రాంతానికి చేరుకున్న ఆయన తొలుత పుష్కర ఘాట్లను పరిశీలించారు. అనంతరం నదీమ తల్లులకు పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ నవ హారతి ఇచ్చారు. అనంతరం సభావేదిక వద్దకు చేరుకుని మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు జీవనదులను కలిపిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. బ్రిటీష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ దొర రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించటం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరిలో ఆయన ఫొటోలు విగ్రహాలకు పూజలు చేస్తున్నారన్నారు. జిల్లాలో ప్రధాన కాలువలకు 12వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కరువును చూసి భయపడేవారమని ఇప్పుడు నదుల అనుసంధానంతో కరువు భయపడాలన్నారు. పొగడ్తలతో... ఇదిలా ఉంటే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గృహనిర్మాణ కార్పొషన్ చైర్మన్ వర్ల రామయ్య, మరో మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని నానిలు సీఎం చంద్రబాబును అపర భగీరథుడు, సర్ ఆర్థర్ కాటన్తో పోల్చారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. కాటన్ మాదిరిగా చంద్రబాబు ఫొటోలను రైతులు తమ ఇళ్లల్లో పెట్టుకోవాలని సూచించారు. సీఎం సభకు కళాశాల విద్యార్థులు ఉదయం 11 గంటలకు సీఎం సమావేశమని డ్వాక్రా మహిళలను ఆటోలు, బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించారు. సోమవారం సీఎం సభకు తరలివచ్చిన మహిళలు సభవాయిదా పడడంతో అవస్థలు పడ్డారు. దీంతో పలు గ్రామాల్లో మహిళలు మంగళవారం సీఎం సభకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జి.కొండూరు ప్రాంతాల్లోని నిమ్రా, నోవా, మిక్, అమృతసాయి, జాకీర్హుసేన్ వంటి పలు జూనియర్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను సభకు తరలించారు. సమావేశం రెండు గంటల ఆలస్యంగా ప్రారంభం కావడంతో సీఎం రాకముందే విద్యార్థులు వెళ్లిపోవటం కనిపించింది. బ్యాగులు, టిఫిన్బాక్స్లు కళాశాలలో వదిలి రావడంతో మధ్యాహ్నం భోజనం సమయం దాటిపోయి విద్యార్థులు ఆకలితో అలమటించారు. విద్యార్థులతో పాటు మహిళలు వేదిక నుంచి బయటకు వెళ్లారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాకముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. సీఎం మాట్లాడుతున్న సమయంలో కూడా మహిళలు భారీగానే బయటకు తరలివెళ్లారు. కేవలం 500 మంది ముందు వరుసలో కూర్చున్న వారినుద్దేశించి సీఎం చంద్రబాబు 30 నిమిషాలు పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. పుష్కరఘాట్లు పరిశీలించేందుకు వచ్చిన సీఎం పుష్కరాల పనులు అసంపూర్తిగా మిగి లినప్పటికీ వాటిపై కనీసం స్పందించక పోవటం గమనార్హం.