breaking news
Heavy Duty Truck
-
ఉమెన్ పవర్
‘మైనింగ్ రంగంలో మహిళలు ఏమిటి?’ అనే ఆశ్చర్యం... మహిళా ఉద్యోగులు సునిత్నమైన పనులు మాత్రమే... అదీ ఆఫీసు నాలుగు గోడల మధ్యే పనిచేయాలనే నమ్మకాలు, అపోహలు...వాటన్నింటినీ బద్దలు కొడుతూ ఉమెన్ పవర్ చాటి చూపుతున్నారు మహిళలు.తాజా విషయానికి వస్తే... మైనింగ్ రంగంలో 50, 100 టన్నుల బరువులు మోసుకెళ్లే హెవీ డ్యూటీ డంపర్లను మహిళలు నడిపిస్తున్నారు. తొలి అడుగు ఉత్తర భారతంలోని టాటా స్టీల్స్ కంపెనీలో పడగా, రెండో అడుగుకు తెలంగాణలోని సింగరేణి వేదికైంది.పదమూడు మంది మహిళా కార్మికులు సిరిసిల్లలోని ‘తెలంగాణ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’లో హెవీ ఎర్త్ మూవర్ మెషిన్లను నడపడంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఇంటర్నల్ రిక్రూట్ ద్వారా సంస్థ పరిధిలోని పదిహేడు ఓపెన్ గనుల్లో విధులు నిర్వహించనున్నారు...వారిలో కొందరి హెవీ వాహన ప్రయాణం గురించి వారి మాటల్లోనే...ఆర్మీ మిస్సైనా... మరుదనాయగం శిరీషమాది మంచిర్యాల జిల్లా మందమర్రి. చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. మా తాత, తండ్రులు, బాబాయ్లు సైతం సైన్యంలో పనిచేశారు. వాళ్ల స్ఫూర్తితో పోలీస్ శాఖలో చేరాలని ప్రయత్నించాను. ఎస్.ఐ. పరీక్షల్లో పల్టీ కొట్టినా, ఆ తర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు సిద్ధమయ్యాను. ఆర్మీలో జాయిన్ అవడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న సమయంలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తోన్న నాన్న రఫేల్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో అమ్మ విక్టోరియా కోరిక మేరకు కుటుంబంకోసం ఆర్మీ కలలను పక్కనపెట్టి సింగరేణి కార్మికురాలిగా 2024 మార్చిలో జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపే అలవాటు ఉంది. ఆ తర్వాత కార్లు కూడా ధైర్యంగా నడిపించేదాన్ని. అయితే, గనుల్లో వాటికంటే పరిమాణంలో, సామర్థ్యంలో పెద్దవైన ప్రొక్లెయినర్లు, డంపర్లు, షావెల్స్ క్రేన్లు కనిపించేవి. కార్లు, బైకులు నడిపిన నాకు వాటిని కూడా నడిపించాలని అనిపించినా, ఎవరిని అడగాలో తెలియక ఆశను మనసులోనే దాచుకున్నాను. సీఎండీ బలరామ్నాయక్ 2024 చివర్లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్లో నేరుగా కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే అదనుగా సీఎండీ సార్తో మాట్లాడుతూ ‘సార్, నాకు గనిలో ఎప్పుడు తిరుగుతూ కనిపించే డంపర్లు నడపాలని ఉంది. నాకు ఆ అవకాశం ఇస్తారా’ అని అడిగాను. దానికి ఆయన ‘అవి నడపాలంటే డ్రైవింగ్లో అనుభవం ఉండాలి. నీకు ఉందా?’’ అని ప్రశ్నించారు. దీంతో చిన్నప్పటి నుంచి బైకులు, కార్లు నడపడంలో నాకున్న అనుభవం గురించి వివరిస్తూ.. మాకు కూడా పురుషులతో సమానంగా డంపర్లు నడిపే ఛాన్స్ ఇవ్వండి అని మరోసారి కోరాను. నా ఉత్సాహం చూసిన సీఎండీ సార్ ‘ సరే,. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాను’ అని హామీ ఇచ్చారు. నిలబెట్టుకున్నారు.ప్రతీ చోట సవాలే.. ప్రయత్నిస్తే విజయాలే – తోకల త్రివేణిమాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. మా నాన్న తోకల ఎల్లయ్య సింగరేణి కార్మికుడు. నాకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో జాయిన్ అయ్యాను. పెళ్లికిముందు నాకున్న కార్ డ్రైవింగ్ అనుభవం తర్వాత పనికి వచ్చింది. మహిళా కార్మికులకు డంపర్ ఆపరేటర్గా అవకాశం ఇస్తామంటూ 2025 ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఓ సవాల్గా తీసుకున్నాను. సిరిసిల్ల ట్రైనింగ్ సెంటర్లో మొదటి వారం థియరీ, సిమ్యులేషన్ మీద క్లాసులు తీసుకున్నారు. తర్వాత 16 అడుగుల పొడవైన స్కూల్బస్సును, 26 అడుగుల పొడవు ఉండే ట్రక్ (లారీ)ని నడిపించడంపై గ్రౌండ్లో శిక్షణ ఇచ్చారు. కానీ శిక్షణ మలిభాగంలో అవే హెవీ వెహికల్స్ను నేరుగా రోడ్డుపై నడపమన్నారు. మొదట్లో కొంత భయపడ్డప్పటికీ, నా ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను గుర్తు తెచ్చుకుని క్లచ్ వదిలి, ఎక్సలేటర్ తొక్కి గేరు మార్చాను అంతే!కెరీర్ గ్రోత్ కోసం...– షేక్ రహమత్ ఉన్నీసామా నాన్న షేక్ అబ్దుల్ ఖదీర్ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పని చేసేవారు. ‘మనది సంప్రదాయ కుటుంబం, కట్టుబాట్లు పాటించాలి’ అనే పరిధిలోనే నేను డిగ్రీ పూర్తి చేయడం. పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే. ఐటీ సర్వీసెస్లో పనిచేసే నా భర్త జుబేర్ అహ్మద్తో పెళ్లి తర్వాత ఆయన నా ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. కొత్తగా ఆయన కారు కొనుక్కోవడమే కాకుండా నాకు పట్టుబట్టి డ్రైవింగ్ నేర్పించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో బదిలీ వర్కర్గా జాయిన్ అయ్యాను. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో 2025 ఆగస్టులో డంపర్ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరెన్ని విధాలుగా వెనక్కి లాగాలని చూసినా వినలేదు. సంప్రదాయ పద్దతిలో రెగ్యులర్ ఆఫీస్ జాబ్కే పరిమితం అవడం కంటే కెరీర్ గ్రోత్ ఉండే డంపర్ ఆపరేటర్గా వెళ్లడమే ఉత్తమం అనుకుని ముందడుగు వేశాను. కొత్త బాటలో నడిచేటప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, తిరస్కారాలు ఎదురుకావచ్చు. వాటిని లెక్కచేయక ముందుకు సాగి విజయం సాధిస్తే తరువాత అదే బాటని మిగిలిన వాళ్లు అనుసరిస్తారు.– తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ఇక ఒలెక్ట్రా ఈ–టిప్పర్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్లో తొలిసారిగా తయారు చేసిన 6్ఠ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్స్కు హోమోలోగేషన్ ధ్రువీకరణ లభించింది. ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ సాధించింది. రహదారులకు టిప్పర్ అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్, క్వారీల్లో పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఈ–టిప్పర్గా ఇది నిలిచిందని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 20 ఈ–టిప్పర్ల సరఫరాకై ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. వివిధ వేరియంట్లలో ఈ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాల్లో ఇది గణనీయమైన మార్పును తేనుందని వివరించారు. -
ట్రక్ల అమ్మకాలు బాగుంటాయ్: వోల్వో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక ఉత్పత్తి ఈ ఏడాది 4 శాతం పెరుగుతుందన్న అంచనాలున్నాయని వోల్వో ట్రక్స్ తెలిపింది. మైనింగ్, నిర్మాణ రంగ కార్యకలాపాల పునరారంభం పెద్ద ఎత్తున ఉండబోతోందని, ఈ నేపథ్యంలో వాణిజ్య వాహనాల అమ్మకాల్లో వృద్ధి ఆశిస్తున్నామని ఏబీ వోల్వో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ డివ్రీ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. 200 బొగ్గు క్షేత్రాలు తెరుచుకునే అవకాశముందని, దీంతో ట్రక్ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయన్నారు. మైనింగ్ నిషేధం, బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు, మందగమన ప్రభావం కంపెనీపైనా పడిందని వీఈ కమర్షియల్ వెహికల్స్ సీఈవో వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు. 2011లో 1,100ల ట్రక్లు విక్రయిస్తే, 2013లో 700 ట్రక్లకే పరిమిత మయ్యామని చెప్పారు. ‘ట్రక్ యజమానులు వ్యాపారాలు లేక నెల వాయిదాలు కట్టలేకపోయారు. ఫైనాన్స్ సంస్థలు కొత్త వాహనాలకు ఫైనాన్స్ నిరాకరించాయి. ఈ కారణంగా వాహనాల అమ్మకాలు పెద్దగా నమోదు కాలేద’ని అన్నారు. 2016లో 1,000 ట్రక్ల విక్రయాలకు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. హెవీ డ్యూటీ విక్రయాల్లో.. గతేడాదితో పోలిస్తే 2014 జనవరి-మే కాలంలో 16 టన్నులు, ఆపై సామర్థ్యంగల హెవీ డ్యూటీ ట్రక్ల విక్రయాల్లో 30 శాతం వృద్ధి చెందామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రామారావు ఏఎస్ తెలిపారు. ఈ విభాగం మార్కెట్ పరిమాణం దేశంలో 1,500 యూనిట్లుందని వోల్వో గ్రూప్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ జీవీ రావు చెప్పారు. 150-225 టన్నులు మోయగల భారీ ట్రక్లు 500 దాకా వోల్వో విక్రయించింది. ఇంధన పొదుపు దిశగా డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఫ్యూయెల్ వాచ్ పేరుతో వోల్వో గత ఐదేళ్లుగా పోటీ నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోటీలకు కొత్తగూడెం సమీపంలోని మణుగూరు సింగరేణి గనులు వేదికైంది.


