breaking news
DGPs-IGPs Conference
-
సున్నితత్వం పెంచుకోండి
రాయ్పూర్: పోలీసులంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న భావనను ఎంతగానో మెరగుపరచాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అది జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. అందుకోసం వారే సున్నితత్వం, జవాబుదారీతనం పెంచుకోవాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఆ శాఖలో ప్రొఫెషనలిజం మరింత మెరుగవాలని ఆకాంక్షించారు. రాయ్పూర్లో మూడు రోజుల పాటు జరిగిన డీజీపీలు, ఐజీల 60వ అఖిల భారత సదస్సును ఉద్దేశించి ఆదివారం ఆయన ప్రసంగించారు. విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడేందుకు పొంచి ఉన్న నిషేధిత శక్తులపై నిత్యం డేగ కన్నుంచడం కూడా అత్యవసరమని ఉద్బోధించారు. వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తమైన ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అప్పుడే ప్రజల్లో వారిపట్ల మరింత సదభిప్రాయం కలుగుతుందని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సువిశాలమైన భారత తీర రక్షణను మరింత బలోపేతం చేసేందుకు వినూత్న చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని చెప్పారు. ‘వికసిత భారతం: భద్రతా కోణాలు’ ప్ర«దానాంశంగా ఈ సదస్సు జరిగింది. డ్రగ్స్ భూతం కట్టడి మొదలుకుని తీర రక్షణ దాకా విభిన్నాంశాలపై మూడు రోజుల పాటు లోతైన చర్చ జరిగింది. విజన్ 2047 సాకారానికి పోలీసులపరంగా తీసుకోవాల్సిన పలు చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. హిడ్మా తదితర మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు ఇటీవలే ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఛత్తీతగఢ్ రాజధాని రాయ్పూర్లో సదస్సు జరగడం గమనార్హం. అర్బన్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడం, పర్యాటక పోలీసింగ్ను మరింత స్నేహశీలంగా మార్చడం, కొత్తగా వచ్చిన భారత న్యాయ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయడం తదితరాలపై పోలీసులు బాగా దృష్టి సారించాలని మోదీ హితవు పలికారు. ప్రాకృతిక విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే విషయంలోనూ పోలీసులు ముందు వరుసలో నిలవాలన్నారు. పోలీసు విచారణల్లో ఫోరెన్సిక్ వాడకంపై కేస్ స్టడీలు రూపొందించాల్సిందిగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు పలుపునిచ్చారు. ఇంటలిజెన్స్ బ్యూరోకు చెందిన అధికారులకు రాష్ట్రపతి పోలీసు మెడల్స్ను మోదీ ఈ సందర్భంగా ప్రదానం చేశారు. అర్బన్ పోలీసింగ్లో అత్యుత్తమంగా నిలిచిన నగరాలకు తొలిసారిగా ప్రవేశపెట్టిన అవార్డులను అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీలు, కేంద్ర పోలీసు బలగాల సారథులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. మరో 700 మందికి పైగా పోలీసు ఉన్నతాధికారులు వర్చువల్గా ఈ కీలక సదస్సులో భాగం పంచుకోవడం విశేషం. -
భద్రతా వ్యవస్థపై విస్తృత చర్చ
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో శనివారం అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. దేశ భద్రతా వ్యవస్థపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సదస్సు గోప్యంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ భద్రత విషయంలో అత్యుత్తమ విధానాలు, నూతన పద్ధతులను పంచుకోవడానికి పోలీసు అధికారుల సదస్సు ఒక ఉత్తమమైన వేదిక అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి రాయ్పూర్కి చేరుకున్నారు. శనివారం ఉదయం సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ చీఫ్ తపన్కుమార్ డేకా, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే డీజీపీలు, ఐజీపీల సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలో నక్సలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి సమస్యలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని ఆయన అన్నారు. ఆదివారం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. -
పెచ్చరిల్లుతున్న డిజిటల్, సైబర్ నేరాలు
భువనేశ్వర్: డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలతోపాటు కృత్రిమ మేధతో సామాజిక, కుటుంబ సంబంధాలకు భంగం కలిగే డీప్ఫేక్ కేసులు పెరుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను గరిష్ట స్థాయిలో వాడుకుంటూ పోలీస్ కానిస్టేబుళ్లపై పనిభారం తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు సిబ్బంది, వనరుల కేటాయింపులో పోలీస్స్టేషన్లు కేంద్ర స్థానాలుగా మారాలన్నారు. ఆదివారం ప్రధాని మోదీ 59వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో మాట్లాడారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనే విషయమై సదస్సులో అన్ని కోణాల్లోనూ విస్తృత స్థాయి చర్చలు జరిగినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను వాడుకుంటూ సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని కోరారు. అర్బన్ పోలీసింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. -
‘సంప్రదాయ పోలీసింగ్’ బలోపేతం
న్యూఢిల్లీ: పోలీసు దళాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీలో సుశిక్షితులు కావాలన్నారు. అదేసమయంలో సంప్రదాయ పోలీసింగ్ విధానాలను బలోపేతం చేసుకోవాలని చెప్పారు. ఆదివారం డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ 57వ అఖిల భారత సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు పరస్పరం సహకారం పెంపొందించుకోవాలని అన్నారు. ఉత్తమమైన విధానాలను పంచుకోవాలని తెలిపారు. వాడుకలోని లేని క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ ప్రమాణాలను మరింత పెంచాల్సి ఉందన్నారు. వివిధ దర్యాప్తు సంస్థల నడుమ డేటాను ఇచ్చిపుచ్చుకొనే విధానం బలపడాలని, ఇందుకోసం నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇక జైళ్ల సమర్థ నిర్వాహణకు సంస్కరణలు చేపట్టాలని తెలిపారు. నూతన సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించుకొనేందుకు పోలీసు ఉన్నతాధికారుల సదస్సులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించుకోవాలని సూచించారు. డీజీపీలు/ఐజీపీల సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 600 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. -
ఆలిండియా డీజీపీల సదస్సు ప్రారంభం
హైదరాబాద్: 51వ ఆలిండియా డీజీపీలు, ఐజీల సదస్సును కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈ సదస్సును ఆరంభించారు. అత్యుత్తమ సేవలు అందించిన హోం శాఖ, ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులకు భారత పోలీస్ పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రాల పోలీసు బలగాలు శాంతిభద్రతలు కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని అన్నారు. అంతకుముందు రాజ్నాథ్ ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు కిరన్ రిజిజు, హన్సరాజ్ గంగారామ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశం ఎదుర్కొంటున్న భద్రత సమస్యలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆయన అక్కడ నుంచి నేరుగా పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి అక్కడే బస చేసి రేపు సదస్సులో పాల్గొంటారు.


