breaking news
death sentense
-
ఆలస్యంగా దక్కిన న్యాయం!
ముప్ఫయ్నాలుగేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో పట్టపగలు ఉన్మాదంతో మూకలు చెలరేగి సాగించిన హత్యాకాండలో మొట్టమొదటిసారి ఒకరికి ఉరిశిక్ష పడింది. 1984 మొదలుకొని ఇన్నేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారికి సుదీర్ఘకాలం తర్వాత దక్కిన తొలి విజయమిది. దక్షిణ ఢిల్లీలోని మహీపాల్పూర్లో 1984 నవంబర్ 1న ఇద్దరు సిక్కు యువకులను పొట్టనబెట్టుకున్న నేరగాడు యశ్పాల్సింగ్కు ఉరిశిక్ష విధించగా, మరో నేరగాడు నరేష్ షెరావత్కు యావజ్జీవ శిక్ష విధించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు అంగరక్షకులు హతమార్చారని తెలియగానే ఢిల్లీలోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉన్మాదులు వీరంగం వేశారు. విచ్చుకత్తులు, పెట్రోల్ డబ్బాలు, ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. మగవాళ్ల ప్రాణాలు తీశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు ఒడిగట్టి చంపేశారు. ఇల్లిల్లూ దోచుకున్నారు. ఈ దాడులు ఏవో చెదురుమదురుగా, ఆవేశంలో జరిగినవి కాదు. కొందరు కాంగ్రెస్ నాయకులు బస్తీల్లో ఉండే లంపెన్ ముఠాలకు డబ్బు, మద్యం సరఫరా చేసి ఒక పథకం ప్రకారం వీటిని నడిపించారు. అధికారం చేతుల్లో ఉంది గనుక ఎవరూ ఏమీ చేయలేరని భరోసా ఇచ్చారు. వారి హస్తమే లేకుంటే వరసగా నాలుగురోజులపాటు ఈ మార ణకాండ ఇంత యధేచ్ఛగా సాగేది కాదు. పోలీసులు చేష్టలుడిగి ఉండిపోయేవారు కాదు. కేసుల దర్యాప్తులో ఇంతచేటు జాప్యం చోటుచేసుకునేది కాదు. దశాబ్దాలు గడుస్తున్నా నేరగాళ్లు తప్పిం చుకునేవారు కాదు. అధికారిక గణాంకాల ప్రకారం 3,350 మంది పౌరులు ఈ నరమేథంలో బలైపోయారు. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 2,733మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అన ధికార అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 7,000కు పైనే. దేశం సిగ్గుతో తలవంచుకునేవిధంగా సాగిన ఈ దుర్మార్గం విషయంలో నేరగాళ్లెవరో వెలికితీయడానికి పీయూడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర హక్కుల సంఘాలు పడిన శ్రమ అసాధారణమైనది. ఆ సంఘాల కార్యకర్తలు రాజ ధాని నగరంలో అన్ని ప్రాంతాలకూ వెళ్లి ప్రత్యక్ష సాక్షులను కలిసి వివరాలు సేకరించి చాలా స్వల్ప వ్యవధిలోనే ‘హూ ఆర్ ద గిల్టీ?’ అనే శీర్షికతో సమగ్రమైన నివేదిక విడుదల చేశారు. మారణకాండ వెనకున్న నాయకుల పేర్లతోసహా ఆ నివేదిక అన్నిటినీ బయటపెట్టింది. ఆ సంఘాలు కొన్ని రోజుల్లోనే పూర్తి చేసిన పనిని అధికార యంత్రాంగం ఏళ్లూ పూళ్లూ గడిచినా సక్రమంగా చేయలేకపోయింది. వందల కేసుల్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న సాకుతో మూసి వేశారు. ఇప్పుడు తీర్పు వెలువడిన కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. కేసు నమోదు చేయమంటూ ప్రాధేయపడినా బాధిత కుటుంబాల గోడు పట్టిం చుకున్నవారెవరూ లేరు. ఘటన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత... అంటే 1993లో ఎన్నో ఒత్తిళ్ల తర్వాత, కోర్టు ఆదేశాలు తర్వాత కేసు నమోదు చేశారు. చివరకు ఏడాదిపాటు దర్యాప్తు పేరుతో సాగదీసి సరైన సాక్ష్యాలు లేవని పోలీసులు తేల్చారు. అయితే 2015లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మూసేసిన 293 కేసుల్ని మళ్లీ ఆరా తీసి అందులో 60 కేసుల్లో గట్టి సాక్ష్యాధారాలున్నాయని తేల్చింది. ఆ 60 కేసుల్లోనూ ప్రస్తుత కేసు ఒకటి. మామూలుగా కనబడే మనిషి అధికార ఉన్మాదం ఆవహిస్తే ఎంతటి క్రూర మృగంగా మారగలడో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. నేరగాళ్లు, బాధితులు ఇరుగుపొరుగువారే. బాగా తెలిసినవారే. కానీ ఆరోజు వందలమందితో వచ్చి బాధితులిద్దరినీ పై అంతస్తునుంచి కిందికి తోసి పెట్రోల్ చల్లి, మండే టైర్లు మీదకు విసిరి సజీవదహనం చేశారు. మరణించే ముందు వారు ఆర్తనాదాలు చేస్తుంటే ఈ మూక కేరింతలు కొట్టింది. ఇలాంటి కేసుల్ని పట్టించు కోనట్టయితే, దోషులెవరో కూపీ లాగనట్టయితే ఆ బాధిత కుటుంబాలు మాత్రమే కాదు... మొత్తం సమాజమే ఎంతో నష్టపోతుంది. ఎందుకంటే–ఇక్కడ బలవంతులదే రాజ్యమని, వారికి తోచినదే న్యాయమని సాధారణ పౌరుల్లో నిరాశ అలుముకుంటే వారు తమకు తోచిన పద్ధతుల్లో న్యాయాన్ని వెదుక్కుంటారు. అప్పుడు రాజ్యమేలేది అరాచకమే. సిక్కుల ఊచకోతపై మొదట్లో వేద్మార్వా ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ కొన్నాళ్లకే మూతబడింది. ఆ తర్వాత అప్పుటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో మరో కమిషన్ వచ్చింది. రెండేళ్ల తర్వాత ఈ మారణకాండకు కర్తంటూ ఎవరూ లేరని, ఇదంతా యాదృచ్ఛికంగా మొదలై ఆ తర్వాత గూండాల చేతుల్లోకి పోయిందని ఆ కమిషన్ తేల్చింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో తొమ్మిది విచారణ కమిషన్లు వచ్చాయి. వాటివల్ల బాధిత కుటుంబాలకు ఒరిగిందేమీ లేదు. కొన్నిటిలో హెచ్కేఎల్ భగత్, సజ్జన్కుమార్, జగదీష్ టైట్లర్, కమలనాథ్ వంటి కొందరి పేర్లు ప్రస్తావనకొచ్చాయి. అయితే క్రియకొచ్చేసరికి జరిగిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఏమైనా చెప్పవచ్చు. కానీ కేంద్రంలో ఎవరున్నా బాధిత సిక్కు కుటుంబాలకు ఒరిగింది శూన్యం. ఆలస్యంగా లభించిన న్యాయం అన్యాయంతో సమానమంటారు. ఇప్పుడు నేరగాళ్లిద్దరికీ శిక్షపడిందిగానీ, ఆప్తులను కోల్పోయిన ఆ కుటుంబాలు ఇన్ని దశాబ్దాలపాటు ఎంత వేదననూ, బాధనూ, కష్టనష్టాల్ని అనుభవించి ఉంటాయో ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఒక అధికారి మంచితనం వల్లనో, ఇంకొక న్యాయమూర్తి చొరవ ప్రదర్శించడం వల్లనో, అధికారంలో ఉన్నవారు తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందనుకుంటేనో మాత్రమే కేసుల్లో కదలిక ఉండే స్థితి మంచిదికాదు. నేరగాళ్లు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా, వారెంత పలుకుబడి కలిగినవారైనా సత్వర చర్యలుండే సమర్ధవంతమైన చట్టబద్ధ వ్యవస్థ నెలకొల్పినప్పుడే మనది నిజమైన ప్రజా తంత్ర రిపబ్లిక్ అనిపించుకుంటుంది. అన్ని పార్టీలూ దీన్ని గుర్తెరగాలి. -
‘కసూర్’ దోషికి మరో 12 మరణ శిక్షలు
లాహోర్: పాకిస్తాన్లో తీవ్ర సంచలనం రేపిన కసూర్ హత్యాచార ఘటనలో దోషికి న్యాయస్థానం మరో 12 మరణ శిక్షలు విధించింది. నేరస్తుడు మరో మూడు నేరాలకు పాల్పడినట్లు తేలడంతో లాహోర్లోని ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు(ఏటీసీ) ఈ తీర్పు వెలువరించింది. కసూర్ నగరానికి చెందిన ఇమ్రాన్ అలీ(23) జనవరి నెలలో జైనబ్(7) అనే చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టడంతోపాటు హత్య చేసి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశాడు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడికి కారణమయింది. అలీపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం..జీవితకాల జైలు, మరణశిక్షతోపాటు రూ.40 లక్షలు చెల్లించాలని ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ విచారణ సందర్భంగా 8 ఏళ్లలోపు మరో ఎనిమిది మంది చిన్నారులపై హత్యాచారం జరిపినట్లు ఒప్పుకున్నాడు. ఇందులో ముగ్గురు చిన్నారులపై నేరాలు రుజువు కావటంతో ఏటీసీ జడ్జి సజ్జాద్ అహ్మద్ 12 మరణశిక్షలతోపాటు రూ.60 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తం నుంచి రూ.30 లక్షలను బాధితుల కుటుంబాలకు చెల్లించాలని ఆదేశించారు. -
సుప్రీం విస్తృత ధర్మాసనానికి యాకూబ్ పిటిషన్
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మంగళవారం యాకూబ్ పిటిషన్ విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించేందుకు జస్టిస్ దవే నిరాకరించగా, ఉరిశిక్ష అమలును జస్టిస్ కురియన్ వ్యతిరేకించారు. దీంతో ఈ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ముంబై పేలుళ్ల కేసులో మెమెన్కు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో ఉంటున్న యాకూబ్కు అక్కడే ఉరిశిక్ష అమలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఉరిశిక్ష రద్దు చేయాలంటూ యాకూబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో జైలు నుంచి భారీ సంఖ్యలో ఖైదీలు తప్పించుకుని వెళ్లిన ఘటనలో ఆయనకీ శిక్ష పడింది. కాగా, ఆయన అధికారంలో ఉండగా నిరసనకారులను అరెస్టు చేయాలని, చిత్రహింసలు పెట్టాలని ఆదేశించినందుకు ఇప్పటికే ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2013 జూలై నెలలో మోర్సీ పాలనపై తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగడంతో.. సైనిక తిరుగుబాటుతో ఆయనను పదవి నుంచి దించేశారు. అప్పటి నుంచి ఆయన స్థాపించిన ముస్లిం బ్రదర్హుడ్ ఉద్యమాన్ని నిషేధించి, ఆయన మద్దతుదారుల్లో వేలాదిమందిని అరెస్టు చేశారు. అయితే.. మోర్సీ మద్దతుదారులు మాత్రం ఇదంతా ఆయనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని, ఇప్పటికే చేసిన కుట్రను న్యాయబద్ధంగా చూపించుకోడానికి ఆయనకు మరణశిక్ష వేశారని అంటున్నారు. ఈజిప్టులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు మోర్సీయే.