Chandra Kumar Bose
-
బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఈ పోరులో బీజేపీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి వచ్చిన కీలక నేత, ఆయన మనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ, టీఎంసీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా చంద్ర కుమార్ బోస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు, పాలించు విధానాన్నే నేడు బీజేపీ పాటిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించిన మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తుండటం ఏమాత్రం అంగీకారం కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్లే తాను తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకుని, బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. #WATCH | Kolkata, West Bengal | Netaji Subhas Chandra Bose's grandnephew Chandra Kumar Bose joins TMC. pic.twitter.com/z8Rzt46XHo— ANI (@ANI) April 12, 2026దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలను భరించలేకే ఆ పార్టీని వీడానని, లౌకికవాదం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న టీఎంసీ విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చంద్ర కుమార్ బోస్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో దీదీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా బెంగాల్ ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత 2021 ఎన్నికల్లో 213 స్థానాలతో అఖండ విజయం సాధించిన టీఎంసీకి, 77 స్థానాలతో బలపడిన బీజేపీకి మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. ఈ తరుణంలో నేతాజీ వారసుడు టీఎంసీలో చేరడం ఆ పార్టీ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
‘సీఏఏపై ఉగ్ర రాజకీయాలు’
కోల్కతా : ప్రజాస్వామ్య దేశంలో పౌరులపై చట్టాలను బలవంతంగా రుద్దరాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏది మంచో..ఏది చెడో చెప్పడం వరకే మన బాధ్యతని, కేవలం సంఖ్యాబలం ఉందని ప్రజలను వేధించరాదని, ఉగ్ర రాజకీయాలకు పాల్పడరాదని వ్యాఖ్యానించారు. ప్రజల వద్దకు వెళ్లి సీఏఏ ప్రయోజనాలను వివరిద్దామని చెప్పుకొచ్చారు. బిల్లు చట్ట రూపం దాల్చగానే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి కట్టుబడి ఉండటం చట్టపరమైన బాధ్యతని, అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై ఏ చట్టాన్నీ రుద్దలేమని అన్నారు. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా తాను బిల్లుకు పలు సవరణలు సూచించానని చెప్పారు. అణగారిన మైనారిటీలకు ఈ బిల్లు ఉద్దేశించిందని, మతం ప్రస్తావన లేకుండా మనం చెప్పాల్సిన అవసరం ఉందని, మన వైఖరి భిన్నంగా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. చదవండి : కలెక్టర్ని జుట్టుపట్టి లాగాడు.. చెంప పగలగొట్టింది -
పౌర చట్టాన్ని ప్రశ్నించిన బీజేపీ నేత
కోల్కతా : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా కోల్కతాలో బీజేపీ భారీ ప్రదర్శన నిర్వహించిన కొద్దిసేపటికే బెంగాల్ బీజేపీ నేత పౌరచట్టాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేయడం దుమారం రేపింది. అన్ని మతాలు, వర్గాలను ఆహ్వానించే దేశం భారత్ అంటూ ఆ పార్టీ నేత, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ ట్వీట్ చేశారు. ‘పౌర సవరణ చట్టం ఏ మతానికి సంబంధించింది కాదని చెబుతున్నప్పుడు మనం హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైన్ల గురించే ఎందుకు మాట్లాడుతున్నాం..ముస్లింలను ఎందుకు కలపలేదు..మనం పారదర్శకంగా ఉండాల’ని బోస్ ట్వీట్ చేశారు. భారత్ను మరో ఇతర ఏ దేశంతోనూ పోల్చకండి..ఇది అన్ని దేశాలు వర్గాలకు ఆహ్వానం పలికే దేశమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త నిరసనలు కొనసాగతున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా విపక్షం నుంచే కాకుండా బీజేపీ ప్రభుత్వానికి అకాలీదళ్, జేడీ(యూ) వంటి మిత్రపక్షాల నుంచి సైతం నిరసన సెగలు తగులుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య, లౌకిక సూత్రాలకు అనుగుణంగా పౌర చట్టంలో ముస్లింలను కూడా చేర్చాలని అకాలీదళ్ డిమాండ్ చేసింది. -
మమతపై నేతాజీ మనవడి పోటీ
భవానీపూర్ నుంచి చంద్రకుమార్ను బరిలోకి దించిన బీజేపీ న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీతో బీజేపీ అభ్యర్థిగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్చంద్ర బోస్ మనవడైన చంద్రకుమార్ బోస్ తలపడనున్నారు. మమతపై తమ అభ్యర్థిగా 55 ఏళ్ల చంద్రకుమార్ పోటీ చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు. బెంగాల్ ఎన్నికల కోసం 52 మంది, అస్సాం ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల చేసింది. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ.. ‘బెంగాల్ ప్రజలు మార్పు కోసం 2011లో తృణమూల్ను గెలిపించారు. అయితే మార్పు రాలేదు. బీజేపీ మాత్రమే మార్పు తెస్తుంది’ అని అన్నారు. మీరు గెలిచే అవకాశముందా అని విలేకర్లు అడగ్గా, ఇది వ్యక్తిగత పోటీ కాదని, ప్రజల అంశమని అన్నారు. చంద్రకుమార్ నేతాజీ అన్న అయిన శరత్చంద్ర బోస్ మనవడు. ఆయన ఈ ఏడాది జనవరి 25న బీజేపీలో చేరారు. కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం పొత్తు అనైతికమని, దానికి ఆ పార్టీల కార్యకర్తలు మద్దతిస్తారా? అని మమత ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నల్లధనం చలామణి, ఓటర్లకు అక్రమ తాయిలాలపై కన్నేయడానికి ఎన్నికల సంఘం ఆదాయపన్ను శాఖ నుంచి 30 మంది ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. -
శాస్త్రి మృతికి బోస్ అంశం కారణమా?
కోల్కతా: మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బోస్ అదృశ్యానికి సంబంధించిన మరిన్ని ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే బహిర్గతం చేయగా.. రష్యాలోని తాష్కెంట్లో మృతి చెందిన లాల్ బహదూర్ శాస్త్రి మృతిపై ప్రభుత్వం సిద్ధంచేసిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారులు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. నేతాజీ కుటుంబానికి చెందిన చంద్రకుమార్ బోస్ సోషల్ మీడియా ఫేస్బుక్లో కొన్ని మిస్టరీ అంశాలను పోస్ట్ చేశారు. ఈ తాజా పరిణామాలను బట్టి చూస్తే శాస్త్రి మరణానికి నేతాజీ అదృశ్యం కారణమా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 1966 జనవరిలో రష్యా పర్యటనకు వెళ్లే ఒక నెల ముందు(డిసెంబర్ 23న) శాస్త్రిని కోల్కోతాలో తన తండ్రి అమియనాథ్ బోస్ కలిసినట్లు పేర్కొన్నారు. తన రష్యా పర్యటనలో నేతాజీ ఆ దేశంలో ఉన్నాడేమో తెలుసుకుంటానని శాస్త్రి ఆ భేటీలో అమియానాథ్కు చెప్పినట్లు వెల్లడించారు. అంతేగాక దేశం గర్వించదగ్గ వ్యక్తి అని, దేశ ప్రధానులందరిలోనూ లాల్ బహదూర్ శాస్త్రి చాలా గొప్పవాడంటూ కొనియాడారు. అయితే తన ఫేస్బుక్ ఖాతాలో శాస్త్రి మృతి, నేతాజీ అదృశ్యం అంశాలపై చంద్రకుమార్ బోస్ పోస్ట్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నట్లు కనిపిస్తోంది. -
మోదీని కలవనున్న నేతాజీ కుటుంబ సభ్యులు
కోల్ కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు మే 17న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం మోదీని కోరినట్టు నేతాజీ మునిమేనల్లుడు చంద్రకుమార్ బోస్ తెలిపారు. మే 17న మోదీని కలవాలని ప్రధాని కార్యాలయం నుంచి తమకు సమాచారం అందిందని చెప్పారు. నేతాని సంబంధించిన రహస్య పత్రాలను వెల్లడిచేయడంతో పాటు పత్యేక దర్యాప్తు బృందం వేయాలని కోరనున్నట్టు తెలిపారు. -
నేతాజీ అదృశ్యంపై 'సిట్'
కోల్కతా: స్వాతంత్ర్య సమయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. నేతాజీ అదృశ్యంపై కొనసాగుతున్న మిస్టరీని ఛేదించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ ఆదేశాలకు అనుగుణంగా సిట్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. ఈ దర్యాప్తు బృందంలో హెం, సీబీఐ, నిఘా, విదేశాంగ, చరిత్ర, పరిశోధక రంగాలకు చెందిన నిపుణులు ఉండాలని సూచించారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను, పత్రాలను మరోసారి పరిశీలించాలన్నారు. ఈ విషయంపై త్వరలో మోడీని కలుస్తామని నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ తెలిపారు.


