breaking news
All women
-
ఈ బ్రాంచ్లో ఉద్యోగులందరూ మహిళలే!
హైదరాబాద్: ఆదిత్య బిర్లా క్యాపిటల్కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ విభాగమైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABSLI), హైదరాబాద్లోని హిమాయత్నగర్లో పూర్తిగా మహిళలతో నిర్వహించబడే తమ తొలి బ్రాంచ్ను ప్రారంభించింది. వృత్తిగతంగా అర్థవంతమైన అవకాశాలు అందించడం, హైదరాబాద్లో తమ కార్యకలాపాలు విస్తరించే క్రమంలో మహిళలకు సాధికారత, సమానావకాశాలు కల్పించే దిశగా ఈ శాఖను ప్రారంభించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వ (DEI) లక్ష్యాల సాధనలో ఇది కీలక మైలురాయిలాంటిదని పేర్కొంది. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాది తొలినాళ్లలో ముంబైలోని ములుండ్లో పూర్తిగా మహిళా సిబ్బందితో శాఖను ప్రారంభించగా, ఇది రెండోదికావడం విశేషం. హిమాయత్నగర్ శాఖను పూర్తిగా మహిళలు నిర్వహిస్తారు. ఫ్రంట్లైన్ సేల్స్ ఉద్యోగిగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన స్థానిక మహిళ దీనికి సారథ్యం వహిస్తున్నారు. ఈ శాఖలో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ రూమ్ కూడా ఉందనీ, శిక్షణ కార్యక్రమాలు, క్లయింట్ సమావేశాలపై దృష్టి పెట్టేందుకు ఇది సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.“మహిళల సాధికారత ఒక బాధ్యత మాత్రమే కాదు, మా వ్యూహాత్మక ప్రాధాన్యతాంశం కూడా అని ABSLI విశ్వసిస్తుంది. సమతౌల్యతను సాధించేందుకు తోడ్పడుతూ, ఆకాంక్షలను గౌరవించే విధంగా వర్క్ప్లేస్లను తీర్చిదిద్దడం ద్వారా సమ్మిళిత వృద్ధికి దోహదపడటంలో, మాకున్న నిబద్ధతకు ఈ ఆల్-ఉమెన్ శాఖ ఒక నిదర్శనం. నాయకత్వం వహించేందుకు, వృద్ధిలోకి వచ్చేందుకు, స్ఫూర్తిగా నిల్చేందుకు మహిళలకు దీర్ఘకాలిక అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం” అని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ & సీఈవో Mr. కమ్లేశ్ రావు తెలిపారు. -
రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!
‘కాపాడుకో...కాపాడు’ నినాదంతో కోలిండియా వరల్డ్ క్లాస్ ఆల్–విమెన్ రెస్క్యూ అండ్ రికవరీ టీమ్లను ఏర్పాటు చేసింది.ఇప్పుడు అదే బాటలో సింగరేణి సంస్థ తొలిసారిగా ఆల్–విమెన్ రెస్క్యూ టీమ్లకు శ్రీకారం చుట్టింది. శిక్షణ మొదలైంది. సింగరేణి చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలవనుంది...రెండేళ్ల క్రితమే సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో సింగరేణి నిర్వహించిన ఎక్స్టర్నల్ పోస్టుల్లో మహిళా గ్రాడ్యుయేట్ ట్రెయినీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో చేరారు. సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,995కి పెరిగింది. రెస్క్యూ శిక్షణ కోసం మైనింగ్ గ్య్రాడ్యుయేట్ ట్రెయినీలతో ఒక్కో బ్యాచ్కు 14 మంది చొప్పున రెండు బ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.కోలిండియాలోని పలు సంస్థలో ఇప్పటికే మహిళా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది సింగరేణిలో జరిగిన ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కోల్ ఇండియాకు చెందిన రెండు మహిళా టీమ్లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు జట్లకు పదహారు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఫస్ట్ ఎయిడ్, రివైనింగ్, రక్షణ పద్దతులు, గనుల్లో గ్యాస్ ఏర్పడినప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గోడలు కట్టే విధానం, అత్యవసర సమయాల్లో స్పందించే పద్ధతి, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు రక్షించే విధానం...మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్లో చేరాను’ అంటోంది ఎన్.రక్షిత. ‘కోల్ ఇండియా స్థాయి రెస్క్యూ పోటీల్లో మా జట్టు సత్తా చూపుతాం’ అంది బి.కళ్యాణి. అందరి మాటల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సాహసానికి ఇంధనం ఆ ఉత్సాహమే కదా!– కాల్వ చంద్రశేఖర్రెడ్డి, సాక్షి, గోదావరిఖనిటఫ్ జాబ్ అంటే ఇష్టం...ఏదో ఒక ఉద్యోగం చేయడం అని కాకుండా టఫ్ జాబ్ చేయడం అంటే మొదటి నుంచి నాకు ఆసక్తి. ఇప్పుడు నా ఉత్సాహానికి తగిన పని దొరికింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో రెస్క్యూ శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ మాకు భవిష్యత్లో ఎంతగానో ఉపకరిస్తుంది. – ఎం.లిఖిత, భూపాల్పల్లిఆత్మస్థైర్యం పెంచేలా...మహిళ మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. రెస్క్యూ బ్రిగేడియర్ శిక్షణ మాలో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు తోటివారికి సహాయ పడేలా చేస్తోంది.– అల్లం నవ్యశ్రీ, ఎంజీటీ, జీడీకే–11 (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
మహిళలందరికీ క్యాన్సర్ పరీక్ష !
ఛండీగఢ్: క్యాన్సర్ మహమ్మారిని నివారించేందుకు విశేషంగా కృషి చేస్తున్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో 40 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 'మేం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం. ఒకవేళ ఈ పరీక్షల్లో వారికి క్యాన్సర్ సోకే అవకాశం ఉందని తెలిస్తే తదుపరి వైద్యం కోసం ఉన్నతస్థాయి ఆస్పత్రులకు పంపిస్తాం' అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. సర్వేకల్ క్యాన్సర్ లక్షణాలు కూడా వైద్యులు గుర్తించి చెప్తారని అన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వ క్యాన్సర్ సోకిన ప్రతి వ్యక్తికి రూ.1.50లక్షల ఆర్థికసహాయం కూడా అందిస్తోంది. -
ఆ బందిపోటు ముఠాలో అందరూ మహిళలే
బెంగళూరు: ఫక్తు సినిమా కథనాన్ని పోలిఉంటుంది వారి దోపిడీ విధానం. హైవేలపై ఉండే చెక్ పోస్టులు, టోల్ గేట్లవద్ద నిస్సహాయులుగా నటిస్తారు. కొద్దిదూరంలో విడిచిపెట్టాల్సిందిగా డ్రైవర్ ను ప్రాధేయపడతారు. అంతలోనే అందమైన మహిళలు వచ్చి వలపు వల వసురుతారు. కట్ చేస్తే.. అన్నీ సర్వస్వం పోగొట్టుకున్న లారీ డ్రైవర్లు లబోదిబోమంటూ పరుగు పెడతారు. ఉత్తర, మధ్య కర్ణాటక జిల్లాల గుండా వెళ్లే 4వ నంబర్ (చెన్నై- ముంబై), 63 వ నంబర్ (అకోలా- గూటీ) జాతీయరహదారుల్లో ఇప్పటికే పలు లూటీలకు పాల్పడ్డ బందిపోటు ముఠాను గురువారం కర్ణాటక పోలీసులు అరెస్టుచేశారు. ఆశ్చర్యకరంమైన విషయమేమంటే ఆ ముఠాలో సభ్యులందరూ మహిళలే. కొప్పాల్ ఇన్స్పెక్టర్ చిత్తరంజన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజాబాయి (60) అనే వృద్ధురాలి నాయకత్వంలో నిలబాయి (45), పల్లవి (22), రాధిక (35), గంగా (20), సరిత (20) అనే మహిళలు లారీ డ్రైవర్లే టార్గెట్ గా హైవేలపై లూటీలకు పాల్పడుతుంటారు. ఏదేనీ చెక్ పోస్టు లేదా టోల్ గేట్ వద్ద లారీ ఆగిఉన్న సమయంలో రాజాబాయి ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరు డ్రైవర్లున్న బండివైపు చస్తే వెళ్లదు. వాళ్ల టార్గెట్ మొత్తం సింగిల్ గా బండి నడిపే డ్రైవర్లే. 'అయ్యా.. ముసలిదాన్ని చేతకావట్లేదు. కొద్దిగా అక్కడ దిగబెట్టవూ' అని మాటకలిపి లారీ ఎక్కి కూర్చుంటుంది. కొద్ది దూరం ప్రయాణించాక ముఠాలో కాస్త అందంగా ఉండే మరో ఇద్దరు తారాసపడతారు. వాళ్లూ లారీలో ఎక్కి కూర్చున్నతర్వాత అసలు సినిమా మొదలవుతుంది. ప్రయాణంలో కుదుపులు, ఊపులకు తగ్గట్లు చూపులు, కదలికలతో డ్రైవర్ ను కవ్విస్తారు. అప్పుడు రాజాబాబు కలుగజేసుకుని ఆ అమ్మాయిలతో వ్యవహారం నేను సెటిల్ చేస్తానని డ్రైవర్ ను నమ్మిస్తుంది. అలా అందరూ కలిసి నిర్జన ప్రదేశానికి వెళతారు. అంతే.. కత్తులు.. అగ్గిరవ్వలతో డ్రైవర్ ను చుట్టుముడతారు బందిపోటు సిబ్బంది సభ్యులందరూ. ప్రాణం దక్కితే చాలనుకునే డ్రైవర్లు తమ దగ్గరున్న డబ్బు, నగలు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు అన్నీ ఆ మహిళలకు సమర్పించుకుని పారిపోతారు. ఇలా దోపిడీకి గురవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వలపన్ని మహిళా బందిపోటు ముఠాను పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఆ ఆరుగురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
మద్యంపై నారీ భేరీ
నర్సింగాపూర్లో సంపూర్ణ మద్య నిషేధం కోసం మహిళల ప్రతిన చందుర్తి: మండలంలోని నర్సింగాపూర్ స్వశక్తి మహిళలందరు ఏకమయ్యారు. మద్యం మహమ్మారిని గ్రామం నుంచి తరిమివేస్తామని ప్రతి నబూనారు. ఇక్కడ మద్యం, సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. యువకులతో పాటు చాలా మంది తాగుడుకు బానిసలవుతున్నారు. దీంతో పచ్చని కాపురాల్లో చిచ్చురగులుతోంది. ఇటీవల కాలంలో వివాదాస్పద సంఘటనలు ఎక్కువయ్యాయి. వీటన్నింటికి మద్యం, సారాలే కారణమని గుర్తించిన మహిళలు.. వాటిని నిషేధించడమే మార్గమని తలచారు. సోమవారం గ్రామంలోని 39 స్వశక్తి సంఘాల మహిళలందరు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. గ్రామ పెద్దలను, పంచాయతీ పాలకవర్గాన్ని అక్కడికే పిలిచారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని తీర్మానించారు. వెంటనే బెల్టుషాపుల నిర్వాహకులు, గుడుంబా అమ్మకందారులను పిలిచి వెంటనే దుకాణాలు ఎత్తివేయాలని హెచ్చరించారు. అనంతరం తమ సంకల్పానికి సహకరించాలని కోరుతూ ఎక్సైజ్, పోలీసు అధికారులకు వినతిపత్రాలిచ్చారు. సర్పంచ్ చింతపంటి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు బండి అమృతరాములు, ఉపసర్పంచ్ ఇ.గణేశ్, చందుర్తి సింగిల్విండో ఉపాధ్యక్షుడు రామస్వామి పాల్గొన్నారు.