
ఈ భవంతి.. జైపూర్ హవా మహల్ని గుర్తుకు తెస్తోంది కదూ! ఇది గంధర్వ మహల్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో ఉంది! ప్రస్తుతం ఇందులో నివసిస్తున్న మూడోతరం.. ఇటీవలే దీని వందేళ్ల వేడుకను ఘనంగా నిర్వహించింది. (Gandharvamahal Achanta) ఈ మహల్ని చూపించడానికి సందర్భం అదే!

ఆచంటకు చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చిన్నతనం నుంచీ కోటలు చూస్తూ పెరగడంతో సొంతూళ్లో అటువంటి కట్టడాన్ని నిర్మించాలని భావించారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి కోటలను క్షుణ్ణంగా పరిశీలించి, 1918లో.. ఈ గంధర్వ మహల్కు శంకుస్థాపన చేశారు.

ఆరేళ్లపాటు కొనసాగిన దీని నిర్మాణం 1924 నాటికి పూర్తయింది. సుమారు ఎకరం విస్తీర్ణంలో కొలువై ఉన్న ఈ మహల్ కోసం అప్పట్లోనే సుమారు పది లక్షల రూపాయల వరకు వెచ్చించినట్టు జమీందారు కుటుంబ సభ్యులు చెప్పారు.

మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. రవాణా సదుపాయం అంతగాలేని ఆ రోజుల్లో జలరవాణా ద్వారా వాటిని తీసుకువచ్చారు.

ఈ కట్టడానికి ఇనుప ఊచల ఊసు లేకుండా డంగు సున్నాన్నే వాడారు. ఈ మహల్లోకి అడుగుపెడితే మైసూర్ మహారాజా ప్యాలస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతి కలుగుతుంది.

1885, లండన్ ఎగ్జిబిషన్లో రజత పతకం గెలిచిన పియానో ఈ మహల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ ఆ పియానో స్వరాలను పలికిస్తుంది.

ఈ గంధర్వ మహల్ ఎందరో ప్రముఖులకు విడిదిగా విరాజిల్లింది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీ రామారావుతో పాటు ఎంతో మంది మాజీ మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భవంతిలోనే బసచేసేవారు.

గంధర్వ మహల్లో సినిమా షూటింగ్లకు అవకాశం ఇవ్వాలని ఎంతోమంది సినీరంగ ప్రముఖులు కోరినప్పటికీ జమీందారు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.






