విదేశీ మహిళకు టోకరా: వెల్వో ట్రావెల్స్ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్: ఇండియన్ కరెన్సీని యూరోలుగా మారుస్తానని నమ్మించి ఆస్ట్రియా దేశానికి చెందిన మహిళను మోసం చేశాడు. ఈ ఘటనలో శ్రీనగర్కాలనీలోని వోల్వో ట్రావెల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మార్ల ఫణికృష్ణ(35)ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ దయాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రియా దేశం వియన్నా నగరంలో నివసించే శిల్పి రాజాదురై గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన వ్యాపారం నిమిత్తం హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్ క్లబ్లో బస చేశారు. ఆమె తిరిగి వెళ్లడానికి యూరోలు అవసరం కాగా అందుకోసం గత ఏడాది జూలై 20న మహేష్బ్యాంకు నుంచి రూ.20.89 లక్షలు డ్రా చేసి వాటిని యూరోలుగా మార్పించుకునేందుకు మార్ల ఫణికృష్ణను ఆశ్రయించింది.
తాను ఇండియన్ కరెన్సీని యూరోల్లోకి మారుస్తానని ట్రావెల్స్ చెక్ ద్వారా ఈ పని సులువుగా అవుతుందని ఆమెను నమ్మించాడు. ఇందుకోసం మల్టీ కరెన్సీ వీసా కార్డు ఇస్తానని దాన్ని ఆమె తల్లి సరళా దీక్షిత్ పేరుతో జారీ చేస్తున్నట్లు చెప్పి వియన్నాలో సరళా దీక్షిత్ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. ఈ మేరకు కార్డు ఇచ్చాడు. తీరా ఆమె వియన్నా వెళ్లే క్రమంలో ఈ కార్డు ద్వారా యూరోలు డ్రా చేసుకోవడానికి యత్నించగా పనిచేయలేదు. బాధితురాలి ఒత్తిడి మేరకు అతడు పలుమార్లు ఇచ్చిన చెక్కులను డ్రా చేసుకోవడానికి యత్నించగా బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితురాలు రెండు రోజులక్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 406ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు.