ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అసలు వ్యవసాయదారులకు, విద్యార్థులకు 2008 నుంచి రుణాలిచ్చిందా అని రాజ్యసభలో వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
ఎస్బీఐ అసలు వారికి రుణాలిస్తోందా?
Nov 29 2016 4:29 PM | Updated on Sep 4 2017 9:27 PM
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అసలు వ్యవసాయదారులకు, విద్యార్థులకు 2008 నుంచి రుణాలిచ్చిందా అని రాజ్యసభలో వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 70 ఏళ్ల పైబడిన వారి విషయంలో ఎస్బీఐ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుందన్నారు. కుటుంబసభ్యులకు గ్యారెంటీగా వ్యవహరిస్తున్న వితంతువులు, వృద్ధ మహిళల పిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. మహిళలు, వ్యవసాయదారులు, గిరిజనులపై క్రూరంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదేశాలతో ఎస్బీఐ వ్యాపారాలు నిర్వహిస్తుందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఆర్థికశాఖ స్పందించాలని పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ సమాధానమిచ్చారు. ఎస్బీఐ విద్యార్థులకు, వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చిందని చెప్పారు. ఎస్బీఐ విచక్షణ, వివక్ష పూరితంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. ఎస్బీఐ పాలసీ ప్రకారం రుణాలకు గ్యారెంటీగా ఓ వ్యక్తి వయసును కాని, వైవాహిక విషయాన్ని కాని పరిగణలోకి తీసుకోవడం లేదని, ఒకవేళ ఏదైనా రుణం మొండిబకాయిగా మారితే, రుణగ్రహిత, గ్యారెంటర్ నుంచి రికవరీ చేసుకునేందుకు సాధారణ ప్రక్రియ ఉంటుందన్నారు. రుణగ్రహిత పేరుమీద లేదా గ్యారెంటర్ పేరు మీద ఇతర డిపాజిట్లు ఉంటే, 1872 కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 171 ప్రకారం తాత్కాలిక చర్యలుగా ఎస్బీఐ చేపడుతుందన్నారు.
Advertisement
Advertisement