
సీమాంధ్ర సమస్యలను పరిష్కరిస్తాం:రాజ్ నాథ్ సింగ్
తాము అధికారంలోకి వచ్చిన తరువాత సీమాంధ్రలో సమస్యలను పరిష్కరిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: తాము అధికారంలోకి వచ్చిన తరువాత సీమాంధ్రలో సమస్యలను పరిష్కరిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడటం శుభసూచికమని ఆయన తెలిపారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయడానికి పార్లమెంట్ లో చివరి వరకు ప్రయత్నించామన్నారు. సీమాంధ్రలో సమస్యలేమైనా ఉంటే తాము అధికారంలో వచ్చిన తర్వాత న్యాయం చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు తప్పుడు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ మరోమారు మండిపడ్డారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆజాద్.. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కాంగ్రెస్ తరువాత మాటమార్చి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న అనంతరం వారి వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. టీడీపీ కూడా రాతపూర్వకంగా విభజనకు అనుకూలమని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.