పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు


కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదనను వామపక్షాలు తిరస్కరించాయి. మమత పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. శుక్రవారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అంటరానివారు ఎవరూ ఉండరని, వామపక్షాలతో పొత్తుపై చర్చలకు సిద్ధమని చెప్పారు. అయితే మమత వ్యాఖ్యలపై శనివారం సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. తృణమూల్‌తో కానీ, మమతా బెనర్జీతో కానీ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని, మమత  రాజకీయ విధానాల వల్లే  బెంగాల్‌లోకి బీజేపీ ప్రవేశించిందని ఆరోపించారు.


 


1998లో బీజేపీతో మమత పొత్తు పెట్టుకున్న విషయాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సుర్జయ్‌కాంత్ మిశ్రా గుర్తు చేశారు. మతతత్వ బీజేపీతో తాము ఒంటరిగానే పోరాడతామని స్పష్టంచేశారు. ఇతర వామపక్ష పార్టీలైన ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ కూడా తణమూల్‌తో పొత్తు ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top