నిర్భయకేసులో నిందితులు దోషులుగా నిర్ధారణ, రేపు తుది తీర్పు | Nirbhaya case: All four found guilty, final verdict tomorrow | Sakshi
Sakshi News home page

నిర్భయకేసులో నిందితులు దోషులుగా నిర్ధారణ, రేపు తుది తీర్పు

Sep 10 2013 12:47 PM | Updated on Sep 1 2017 10:36 PM

నిర్భయకేసులో నిందితులు దోషులుగా నిర్ధారణ, రేపు తుది తీర్పు

నిర్భయకేసులో నిందితులు దోషులుగా నిర్ధారణ, రేపు తుది తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను దోషులుగా నిర్ధారించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను దోషులుగా నిర్ధారించారు. వీరికి శిక్షను మాత్రం రేపు ఖరారుచేయనున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం నాడు తెలిపారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి.

గత సంవత్సరం డిసెంబర్‌లో దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్‌లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. ఈ కేసులో మైనర్ అయిన మరో నిందితునికి మూడేళ్ల జైలుశిక్ష ఇప్పటికే ఖరారైంది. దీంతో మొత్తం జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది. అంతకుముందు మంగళవారం ఉదయమే తీహార్ జైలు నుంచి నలుగురు నిందితులను న్యూఢిల్లీలో గల సాకేత్ ప్రాంతంలోని ప్రత్యేక కోర్టుకు తరలించారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో తీర్పు వెల్లడించగానే సందడి నెలకొంది.

గత డిసెంబర్ 16 నాటి రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపైనా (ఈ యావత్ ఉదంతానికి ఇతనొక్కడే ప్రత్యక్ష సాక్షి) దాడి చేశారు. తీవ్రగాయాలతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితులను సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది.

Advertisement
 
Advertisement
Advertisement