కాంగ్రెస్ పని గోవిందా.. దక్కేవి 73 లోక్సభ సీట్లే!
న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడనుందా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ ఎంపీల సంఖ్య రెండంకెలకే పరిమితం కానుందా? ఆ పార్టీ చచ్చీ చెడీ గెలిచే ఎంపీ స్థానాలు ఎన్నో తెలుసా? కేవలం 73 మాత్రమే..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఏబీపీ న్యూస్, నీల్సన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని.. ఆ పార్టీకి 217 సీట్లు వస్తాయని.. మొత్తం ఎన్డీఏకు 236 ఎంపీ సీట్లు దక్కుతాయని సర్వే తేల్చిచెప్పింది. జనవరిలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వే నాటి కంటే ఇప్పుడు ఎన్డీఏకు పది సీట్లు పెరిగాయి. తొలిసారి లోక్సభ బరిలో దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పది సీట్లు దక్కించుకోబోతోంది. కాంగ్రెస్కు దక్కే కొద్దిపాటి సీట్లు కూడా దక్షిణ భారతంలో తప్ప ఉత్తరాదిన ఏమాత్రం అవకాశం లేదని సర్వే నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రధాని మంత్రి అభ్యర్థిగా మోడీకి 57 శాతం మంది మద్దతు పలకగా, కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీకి కేవలం 18 శాతం మంది మాత్రమే దన్నుగా ఉన్నారు. ఇక ప్రాంతీయ పార్టీల్లో తృణమాల్ కాంగ్రెస్కు 29, అన్నా డీఎంకేకు 19, బీజేడీకి 16 సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపే ద్రవ్యోల్బణం అతి పెద్ద సమస్య అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అవినీతి రెండో అతిపెద్ద సమస్య అని 34 శాతం, నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని 18 శాతం మంది అభిప్రాయపడ్డారు.