
సాక్షి, హైదరాబాద్: దుబాయ్లో ఉండలేమని, తిరిగి వచ్చేస్తామని యూఏఈ ఆమ్నెస్టీ బాధితులు తెలంగాణ ప్రభుత్వ బృందానికి తెలిపినట్లు బృంద సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బాధితులను తిరిగి తెలంగాణ తీసుకొచ్చేందుకు వెళ్లిన ప్రభుత్వ బృందానికి షార్జాలో తెలంగాణ వాసుల నుంచి ఘనస్వాగతం లభించినట్లు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన వందలాది మంది తెలంగాణ వాసులు వారి సమస్యలు బృందానికి చెప్పుకున్నారని తెలిపారు.
సమస్యలను అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్ దృష్టికి తీసుకెళ్లామని, వారందరినీ తెలంగాణకు పంపించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఆమ్నెస్టీ ద్వారా తెలంగాణకు తిరిగి రావాలనుకునేవారి సంఖ్య 500 పైగా ఉండే అవకాశం ఉందని, వీరందరి టికెట్ల ఖర్చు తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని బృంద సభ్యులు అరవింద్సింగ్, మహేశ్ బిగాల, రషీద్, చిట్టిబాబు, నరసింహనాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు.