విద్యుదాఘాతంతో వేర్వేరు చోట్ల ఇద్దరు రైతన్నలు మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
నల్లగొండ (మిర్యాలగూడ/త్రిపురారం): విద్యుదాఘాతంతో వేర్వేరు చోట్ల ఇద్దరు రైతన్నలు మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకెళితే.. త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హర్జ్యాతండాకు చెందిన రమావత్ హనుము(40) తనకున్న ఎకరంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. బుధవారం ఉదయం నీరు పెట్టడానికి పొలానికి వెళ్లి.. మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగలను తాకి అక్కడికక్కడే మృతిచెందాడు.
అలాగే, మిర్యాలగూడ మండలం గూడూరుకు చెందిన పెదపంగ వేణు(23) డిగ్రీ వరకు చదివి, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వరి చేనుకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు అన్న ఏడుకొండలుతో కలసి పొలానికి వెళ్లాడు. అర ఎకరం పొలంలో మందు పిచికారీ చేసి తన సొంత పొలంలో సాగు చేస్తున్న మరో ఎకరం వరికి మందు పిచికారీ చేసేందుకు వెళ్తూ .. పక్క పొలంలో తెగిపడి ఉన్న ఎర్త్వైర్ తగిలి వేణు అక్కడికక్కడే మృతిచెందాడు.


