‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’కు కార్యాచరణ | Special workbook for teaching the illiterates | Sakshi
Sakshi News home page

‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’కు కార్యాచరణ

Jan 6 2020 2:10 AM | Updated on Jan 6 2020 2:10 AM

Special workbook for teaching the illiterates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన ఈచ్‌ వన్‌ – టీచ్‌ వన్‌ కార్యక్రమానికి వయోజన విద్య విభాగం సిద్ధం అవుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో 53.39 లక్షల మంది నిరక్షరాస్యులు ఉండగా, మరింత తాజా సమాచారం కోసం గ్రామాలవారీగా నిరక్షరాస్యుల వివరాలను సేకరిస్తోంది. అందులో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వర్క్‌బుక్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు ప్రత్యేక పాఠాలు పొందుపరుస్తోంది.

మరోవైపు తెలుగు వర్ణమాల, గుణింతాలు మొత్తం వచ్చిన వారి కోసం 1 నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాలను కుదించి అన్ని సబ్జెక్టులు ఒకే పుస్తకంలో ఉండేలా దానిని రూపొందిస్తోంది. తెలుగు వర్ణమాలలోని అక్షరాలు నేర్పించేందుకు, అవి వచ్చిన వారికి వర్క్‌బుక్‌లోని పాఠ్యాంశాలు బోధించేందుకు నిర్ణీత గడువు విధించి పని చేసేందుకు చర్యలు చేపట్టింది.

ఇందులో అక్షరాలు నేర్చుకున్నవారికి పరీక్షలు నిర్వహించి మంచి మార్కులు సాధించిన వారిని అభినందించడం, బోధకులను సన్మానించడం వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు వయోజన విద్యావిభాగం కసరత్తు చేస్తోంది. చదువుకునేందుకు ముందుకొచ్చిన వారి వివరాలను రిజిస్టర్‌ చేయడానికి ఒక వెబ్‌సైట్, వీలైతే ప్రత్యేక యాప్‌ ను రూపొందించాలని భావిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యత కార్యక్రమంలో ఎంత మంది పాల్గొంటారు.. కార్యక్రమం ఎలా సాగుతోందన్న వివరాలు అందుబాటులోకి రానున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement