క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సిద్దిపేట | Siddipeta can be done as Clean and Green City | Sakshi
Sakshi News home page

క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సిద్దిపేట

Nov 16 2014 11:16 PM | Updated on Sep 2 2017 4:35 PM

క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సిద్దిపేట

క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సిద్దిపేట

సిద్దిపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు.

సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని రాష్ట్ర  నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు.  ఆదివారం సిద్దిపేటలోని వివిధ కాలనీల్లో రూ. 65 లక్షల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాల్టీలో విలీనమైన గ్రామాలతో పాటు పట్టణంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పరిశుభ్రమైన పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.

పట్టణంలోని వివిధ కాలనీల్లో పచ్చదనం కోసం గతంలోనే విస్తృతంగా మొక్కలు నాటామన్నారు.  మొక్కలు వృక్షాలుగా మారేవరకు స్థానికులు సంరక్షించాలన్నారు. నియోజకవర్గ ప్రజల అండదండలు, ఆధారాభిమానాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.  ఇందిరానగర్ నార్త్‌లో రూ. 15 లక్షలు, ఇందిరానగర్ సౌత్‌లో రూ.10 లక్షలతో నిర్మించే మురుగు కాల్వలకు, హనుమాన్‌నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 10 లక్షలు, రంగధాంపల్లిలో రూ. 10 లక్షలు, శంకర్‌నగర్‌లోని రెండు రోడ్లను పొడగించే పనులకు రూ. 10 లక్షలు, నాసర్‌పురాలో డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ నిర్మాణం కోసం రూ. 10 లక్షలతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాలనీల్లో మంత్రి హరీష్‌రావుకు స్థానిక మహిళలు మంగళహారతులతో తిలకం దిద్ది స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఏఈ ఇంతియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, నయ్యర్ పటేల్, జంగిటి కనకరాజు, గుండు శ్రీనివాస్‌గౌడ్, మోహన్‌లాల్, శేషుకుమార్, నల్ల నరేందర్‌రెడ్డి, జనార్దన్, నాయకం వెంకట్, దర్పల్లి శ్రీను, కొండం సంపత్‌రెడ్డి, సీఐలు సురేందర్‌రెడ్డి, సైదులు, ప్రసన్నకుమార్, ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికి పింఛన్ ఇస్తాం
సిద్దిపేట రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుందని, ఈ నెల 25న పంపిణీ చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని బంజేరుపల్లిలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెల నుంచి బియ్యం కోటాను 4కిలోల నుంచి 6కిలోలకు పెంచుతున్నట్లు తెలిపారు.  కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరికీ ఆరు కిలోల చొప్పున ఇస్తామని తెలిపారు.

అలాగే బంజేరుపల్లి గ్రామానికి దశలవారీగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్డు రూ.10లక్షలతో నిర్మాణం చేశామన్నారు. అదే విధంగా మరో రూ. 5లక్షలు సీసీ రోడ్డుకు, రూ. 6లక్షలు మహిళ భవనానికి మంజూరు చేయిస్తానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 95 శాతం పోలింగ్ నమోదు కావడంతో ప్రభుత్వం గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి  రూ. 2లక్షలు మంజూరు చేసిందన్నారు. వాటితో వాటర్ మిషన్ తెచ్చామని, అదే విధంగా స్తంభానికి తమ వంతు సాయంగా రూ. 1.50లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్‌రావు, గ్రామ సర్పంచ్ భూమయ్య, ఎంపీటీసీ రోమాల శాంత రాజయ్య, అర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌చారి, నాయకులు బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement