ఇంధన పొదుపులో ఆర్టీసీకి రెండు అవార్డులు | Medals For Nalgonda And Kalwakurthy Depot | Sakshi
Sakshi News home page

ఇంధన పొదుపులో ఆర్టీసీకి రెండు అవార్డులు

Dec 21 2019 5:05 AM | Updated on Dec 21 2019 5:05 AM

Medals For Nalgonda And Kalwakurthy Depot - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంధన పొదుపులో చురుగ్గా వ్యవహరించిన ఆర్టీసీలోని రెండు డిపోలకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టి.ఎస్‌.రెడ్‌కో) అవార్డులు దక్కాయి. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ అధీనంలోని బ్యూరో ఆఫ్‌ ఎఫిషియెన్సీతో కలసి టి.ఎస్‌.రెడ్‌కో శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా ఆర్టీసీ అధికారులు బంగారు, వెండి పురస్కారాలు అందుకున్నారు. 2018–19కి గానూ నల్లగొండ డిపో 106 బస్సులు, 171.51లక్షల కిలోమీటర్ల ఆపరేషన్‌తో 1.65లక్షల లీటర్ల ఇంధనం ఆదా చేసింది. తద్వారా రూ.1.09 కోట్ల ఖర్చు తగ్గింది. దీంతో ఇంధన పొదుపులో నల్లగొండ డిపో టాప్‌గా నిలిచి బంగారు పతకం దక్కించుకుంది. కల్వకుర్తి డిపోలో 77 బస్సులతో 98.71లక్షల కిలోమీటర్లు ఆపరేట్‌ చేసి, 1.37లక్షల లీటర్ల ఇంధనం ఆదాతో రూ.91.45 లక్షల ఖర్చు తగ్గింది. ఆ డిపో వెండి పతకం సాధించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇంజనీరింగ్‌) సి.వినోద్‌ కుమార్, సీఎంఈ టి.రఘునాథరావు, నల్లగొండ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న, నల్లగొండ, కల్వకుర్తి డిపో మేనేజర్లు సురేశ్, సుధాకర్‌ పురస్కార స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement