9 మందితో టీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ

KTR Orders To Committee Members To Work From Telangana Bhavan - Sakshi

ఎన్నికలయ్యే వరకు తెలంగాణ భవన్‌ నుంచే కమిటీ సభ్యులు పనిచేయాలని కేటీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తెలంగాణభవన్‌ నుంచి క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులతో కలసి సమన్వయంతో పనిచేసేందుకు 9 మందితో కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి పురపాలికలోని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్థానిక నాయకత్వానికి సహకారం అందిస్తుంది. ఈ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, నేతలు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్‌రావు, దండె విఠల్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు ఉన్నారు. వీరు జిల్లాల వారీగా ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో మాట్లాడాలని కేటీఆర్‌ సూచించారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారానికి అవసరమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు పార్టీ నాయకులతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని అదేశించారు. అలాగే సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 14 తేదీ వరకు పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన రెబల్‌ అభ్యర్థులతో మాట్లాడి, వాటిని ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. సాధ్యమైనన్ని ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యేదాకా సాధ్యమైనంత ఎక్కువ సమయం పార్టీ కార్యాలయంలోనే ఉండాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top