ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్కు ఇంకా అలవాటు కాలేదా..? వరుసగా పదేళ్లు అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు విపక్షంగా విఫలమవుతున్నారా?
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతర్మథనం
Nov 8 2014 3:15 AM | Updated on Mar 18 2019 9:02 PM
ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్కు ఇంకా అలవాటు కాలేదా..? వరుసగా పదేళ్లు అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు విపక్షంగా విఫలమవుతున్నారా? దీనికి కొందరు కాంగ్రెస్ఎమ్మెల్యేలు అవుననే తలలూపుతున్నారు. తమకున్న దూకుడుకు సీనియర్లు కళ్లెం వేస్తున్నారన్న అసంతృప్తీ వీరిలో ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రెండో రోజే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు నీరసించినట్లే కనిపించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్కు ఇంకా అలవాటు కాలేదా? వరుసగా పదేళ్లు అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు విపక్షంగా విఫలమవుతున్నారా? దీనికి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవుననే అంటున్నారు. తమ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేస్తున్నారన్న అసంతృప్తి కూడా వారిలో ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రెండో రోజే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు నీరసించినట్లే కనిపించారు. పక్కా ప్రణాళిక అంటూ లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పైచేయి సాధించాల్సినస్థానే, వెనకబడి పోతున్నామని వారు వ్యక్తిగత చర్చల్లో బలంగా అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం సభను టీడీపీ కొద్దిసేపు హైజాక్ చేసింది. రైతుల ఆత్మహత్యలను కించపరిచేలా మాట్లాడిన మంత్రి పోచారం క్షమాపణ చెప్పాలని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. 10 మంది సస్పెండ్ అయ్యారు కూడా. ఇది ఆ పార్టీని హైలైట్ చేసిందని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే వ్యూహాన్ని ఖరారు చేసేందుకు జరిపిన రెండు సీఎల్పీ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న అభిప్రాయం పలువురు పార్టీ ఎమ్మెల్యేల్లో బలంగా వ్యక్తం అవుతోంది. సీఎల్పీ సమావేశాల్లో ఏఐసీసీ నాయకత్వాన్ని పొగడడానికి, పార్టీకి విధేయులుగా ఉన్నామని చెప్పుకోవడానికే పరిమితం అవుతున్నారంటున్నారు. చివరకు విద్యుత్ అంశంపై అవగాహన పెంపొందించుకునేందుకు షబ్బీర్ అలీ ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశం కూడా ఫలవంతం కాలేదంటున్నారు. నాయకులంతా చేరుకుని, భోజనాలు చేసేసరికే పుణ్యకాలం గడిచిపోయిందని ఒక ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు.
అప్పటికప్పుడు అనుకుని...
రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నివారించాలని, ఇందుకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గన్పార్క్ వద్ద శుక్రవారం జరిపిన ధర్నా కూడా అప్పటికప్పుడు నిర్ణయించి చేసిందేనని సమాచారం. టీడీపీ ఇదే అంశంపై ధర్నా చేస్తుందని తెలిసి.. అప్పటికప్పుడు అనుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేసినట్లు చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఇంకా ఇమడలేక పోతున్న కాంగ్రెస్కు కొందరు సీనియర్ నేతల మెతక వైఖరి, వ్యక్తిగతాంశాలు అడ్డంకిగా మారతున్నాయంటున్నారు.
Advertisement
Advertisement