కేరళకు విరాళాల వెల్లువ
మేము సైతం అని ముందుకొస్తున్న ఉద్యోగులు
ఒక రోజు వేతనాన్ని అందించిన పలు విభాగాల ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ఉద్యోగులు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారు.
విరాళాలు అందించిన వారు..
♦ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక రోజు బేసిక్పేను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ ఎస్కే జోషిని కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కారం రవీందర్రెడ్డి రూ.48 కోట్లకు సమ్మతి పత్రాన్ని అందించారు.
♦ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులంతా ఒక రోజు వేతనాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు.
♦ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగులంతా ఒక రోజు వేతనానికి సంబంధించి రూ.9 కోట్ల చెక్కును మంత్రి జగదీశ్రెడ్డికి అందించారు.
♦ రాజ్భవన్ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. అలాగే గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ రూ.10 వేలు విరాళాన్ని అందించారు.
♦ రాష్ట్రంలోని తహసీలార్లు, వీఆర్వోలు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతమ్కుమార్ సీఎస్ జోషికి అంగీకార పత్రం అందించారు.
♦ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున రూ.4 కోట్లు అందిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్రెడ్డి తెలిపారు.
♦ తెలంగాణ మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు మంత్రి కేటీఆర్కు అనుమతి పత్రాన్ని అందజేశారు.
♦ కేరళకు పంపే నిత్యావసర వస్తువులు, సరుకులను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ తెలిపారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే 60 టన్నుల వస్తు సామగ్రిని మంగళవారం కేరళకు పంపింది.