పరిహార మార్గాలు చూపండి | etela rajender attend to 14th planning commission meeting | Sakshi
Sakshi News home page

పరిహార మార్గాలు చూపండి

Sep 11 2014 2:23 AM | Updated on Aug 27 2018 8:44 PM

జీఎస్‌టీ (వస్తు, సేవా పన్ను) కారణంగా రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని సమకూర్చేందుకు పరిహారమార్గాలు చూపిన తర్వాతే దాని అమలుకు పూనుకోవాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కోరారు.

* ఆ తర్వాతే ప్రధాన ఆదాయవనరులను మినహాయించండి
* జీఎస్‌టీ అమలుపై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల విజ్ఞప్తి
* హస్తినలో 14వ ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం
* పెట్రోల్, ఎక్సైజ్, పొగాకు, ధాన్యాన్ని మినహాయించాలి: ఈటెల
 
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న జీఎస్‌టీ (వస్తు, సేవా పన్ను) కారణంగా రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని సమకూర్చేందుకు పరిహారమార్గాలు చూపిన తర్వాతే దాని అమలుకు పూనుకోవాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కోరారు. ఒకే పన్ను విధానంతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వనరులకు గణనీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నట్టు సమాచారం. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 14వ ఆర్థిక సంఘం నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహా ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు.

జీఎస్‌టీ అమలు సాధ్యాసాధ్యాలపై మంత్రులతో పాటు ఆర్థిక సంఘం, ప్రభుత్వ ప్రతినిధులు, జీఎస్‌టీపై వేసిన సాధికార కమిటీ తమ తమ అభిప్రాయూలను వెల్లడించారు. రాష్ట్రాల్లోని ప్రధాన ఆదాయ వనరులను జీఎస్‌టీ నుంచి మినహాయించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాల్సిన వ్యాట్ బకాయిలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని, ఇక జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని ఏవిధంగా తిరిగి సమకూరుస్తారన్న అంశంపై కేంద్రం భరోసా ఇవ్వాలని ఆర్థిక మంత్రులు కోరారు.

జీఎస్‌టీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తుందని యనమల చెప్పారు. అయితే జీఎస్‌టీ కారణంగా ఏపీ కోల్పోతుందని అంచనా వేస్తున్న దాదాపు రూ.4 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆయన కోరారు. పరిహారం చెల్లింపునకు సైతం స్వతంత్య్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రెటోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ నుంచి మినహాయించడంతో పాటు లెవీ ట్యాక్స్‌లు విధించుకునే వీలు కల్పించాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

వ్యాట్ బకాయిలు చెల్లించమని కోరాం: ఈటెల
 గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకా రం వ్యాట్ బకాయిలను చెల్లించాలని సమావేశంలో కోరినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2005లో వ్యాట్ అమలు సందర్భంగా.. రాష్ట్రాలు నష్టపోయే మొత్తాన్ని పూడుస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అది అమలు కాలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో జీఎస్‌టీ అమలు చేస్తే రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉంటాయని అన్నారు.

జీఎస్‌టీ కారణంగా నష్టపోయే మొత్తాలను ఏవిధంగా చెల్లిస్తారనే అంశంపై ముందస్తు ప్రణాళికలు ఉండాలని సూచించిన ట్టు తెలిపారు. జీఎస్‌టీ అమలు చేయాలనుకుం టే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి పన్నుల రూ పంలో దాదాపు 50 శాతం ఆదాయ మార్గాలైన పెట్రోలియం ఉత్పత్తులు, ఎక్సైజ్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ధాన్యం వంటి వాటిని దా న్నుంచి మినహాయించాలని కోరినట్టు చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు తప్పకుండా తేవాలనే యోచనలో కేంద్రం ఉన్న ట్టు ఆయన వెల్లడించారు. ప్రజలకు అనుకూలమైన, అవసరమైన ప్రణాళికలు ఉండేలా, కొత్త పంథాకి శ్రీకారం చుట్టేలా తెలంగాణ బడ్జెట్‌ను రూపొందిస్తామని ఈటెల చెప్పారు.   

మీడియాపై ద్వేషం లేదు
మీడియాకు తాము వ్యతిరేకం కాదని, తమకు ఎవరిపైనా ద్వేషం లేదని తెలంగాణ ఆర్థికమంత్రి చెప్పారు. ‘కించపర్చేలా మాట్లాడితే ఎట్లా ఉంటది. కామెంట్ చేయడానికి అర్థం పర్థం ఉండాలి. దీనిపై దేశవ్యాప్తంగా జాతీయ చానళ్లలో చర్చ పెట్టండి. అది సమంజసమే అని చెప్పగలిగితే మంచిది’ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ చానల్  ప్రసారాలను నిలిపివేయలేదని, అసెంబ్లీలో చేసిన తీర్మానంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎంఎస్‌ఓల చర్యను తామెందుకు ఖండిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement