రబీకి 9 గంటల కరెంట్ | Current 9 hours to Rabi | Sakshi
Sakshi News home page

రబీకి 9 గంటల కరెంట్

Oct 19 2016 3:34 AM | Updated on Nov 9 2018 5:56 PM

రబీకి 9 గంటల కరెంట్ - Sakshi

రబీకి 9 గంటల కరెంట్

వచ్చే రబీ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

మంత్రి హరీశ్‌రావు వెల్లడి
 
 నంగునూరు: వచ్చే రబీ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలో 133/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన  ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘‘ఇప్పుడు కాలమైంది.. బీడు భూములు సైతం సాగులోకి రానున్నారుు.. వచ్చే రబీ సీజన్‌లో 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి సర్కార్ మాట నిలబెట్టుకుంటుంది’’ అని పేర్కొన్నారు.

రైతు కష్ట సుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీరుపారుదల రంగానికి రూ.25 వేల కోట్లు కేటారుుంచినట్టు తెలి పారు. మిషన్ కాకతీయలో చెరువుల్లో పూడిక తీయడంతో నీటితో కళకళలాడుతున్నారుుని, వీటిని చూస్తే కడుపు నిండినట్టుందన్నారు. భూగర్భ జలాలు పెరగడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు.

 ఏడాదిలోపు కాలువలకు నీరు
 ప్రస్తుతం చెరువులు నిండినప్పటికి ఈ ప్రాంతంలో శాశ్వత కరువు నివారణ కోసం ఏడాదిలోపు కాల్వల ద్వారా కాళేశ్వరం నీటిని అందిస్తామన్నారు. కాల్వల నిర్మాణం కోసం రైతులు భూములు ఇవ్వాలని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

 పత్తికి మంచి డిమాండ్
 దేశవ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం తగ్గడం, పక్కదేశం పాకిస్తాన్‌లో పంటంతా నాశనం కావడంతో కాటన్‌కు మంచి డిమాండ్ ఉందని మంత్రి అన్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.  మద్దతు ధర రూ.4,160 చెల్లిస్తామన్నారు.  వచ్చే సీజన్ నాటికి 10 వేల మెగావాట్ల విద్యుత్ సిద్ధంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 7 వేల మెగా వాట్ల విద్యుత్తు డిమాండ్ ఉంటే మరో మూడువేల మెగావాట్లు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఇదే కాకుండా లోఓల్టేజీ సమస్య నివారణకు అదనంగా 2వేల కిలోమీటర్ల మేర విద్యుత్తు లైన్లను వేశామన్నారు. 3 వేల ట్రాన్‌‌సఫార్మర్లు సిద్ధంగా ఉంచినట్టు మంత్రి తెలిపారు. నిరుపేదలకు మేలు చేకూర్చేందుకు దీన్‌దయాల్ పథకం ద్వారా తక్కువ ధరకే కొత్త కనెక్షన్లు ఇవ్వడంతో పాటు సర్వీస్ వైరు కూడా తామే అందజేస్తున్నామని చెప్పారు.
 
 పోలీస్‌శాఖలో 18 వేల ఉద్యోగాలు భర్తీ
 సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా దాదాపు 18 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్లతోపాటు ఆయా జిల్లాల్లో 21 ఎస్పీ కార్యాలయాలు, 24 డీఎస్పీ కార్యాలయాలు, 28 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలోనే 6,278 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో అటవీశాఖ ద్వారా 2 వేల ఉద్యోగాలు, పోలీస్‌శాఖ ద్వారా మరో 2 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 9,281 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement