తెలంగాణలో 213 మందికి పాజిటివ్‌

Coronavirus : 213 New Positive Cases Registered In Telangana - Sakshi

రాష్ట్రంలో 5,406కి చేరిన కేసులు 

నలుగురు మృతి.. 191కి చేరిన మరణాలు 

సగటున 12.16 శాతం పాజిటివ్‌ కేసులు నమోదు 

3.5 శాతంగా మరణాల రేటు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 213 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 5,406కి చేరింది. మంగళవారం కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 191కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్‌లో 2,188 మంది ఉండగా.. ఇప్పటివరకు 3,027 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 165 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 16, మెదక్‌ జిల్లాలో 13, కరీంనగర్‌ జిల్లాలో 6, మేడ్చల్‌ జిల్లాలో 3, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో రెండు చొప్పున, యాదాద్రి, సిద్దిపేట, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, జనగామ, జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

ఇప్పటివరకు 44,431 మందికి పరీక్షలు.. 
రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో సగటున 12.16శాతం పాజిటివ్‌ రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 44,431 మందికి పరీక్షలు నిర్వహించగా.. 5,406 మందికి పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 1,251 మందికి పరీక్షలు నిర్వహించగా.. 213 (17 శాతం) పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 3.5 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top