పేదలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇళ్లపై నుంచి విద్యుత్ లైను వెయ్యొద్దన్న పాపానికి లాఠీ ఎత్తారు.
'ముత్యంపేట' వాసులపై లాఠీచార్జి
ఇళ్లపై నుంచి విద్యుత్ లైన్ వెయ్యొద్దన్న పాపానికి విరిగిన లాఠీ
పలువురికి తీవ్ర గాయాలు
రహదారిపై ధర్నా
గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
దౌల్తాబాద్: పేదలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇళ్లపై నుంచి విద్యుత్ లైను వెయ్యొద్దన్న పాపానికి లాఠీ ఎత్తారు. విద్యుత్ లైన్తో ప్రమాదాలకు గురవుతామన్నా కరుణించకపోగా చేతులు, కాళ్లు విరగ్గొట్టారు. ఈ దారుణం మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన పేదల ఇళ్ల పైనుంచి బడా బాబులకు సంబంధించిన కోళ్ల ఫారాలకు 11కేవీ విద్యుత్లైన్ వేసే విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొంది. విద్యుత్ వైర్లువేస్తే ప్రమాదాలకు గురవుతామని స్థానికులు అభ్యంతరం చెబుతూ వచ్చారు. సుమారు 6 నెలలుగా ఈ వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో మంగళవారం విద్యుత్ సిబ్బంది 11కేవీ వైర్లను బిగించేందుకు పోలీసుల సహకారంతో సిద్ధమయ్యారు. విద్యుత్ సిబ్బంది లైన్ వేస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు సిబ్బందిని అడ్డుకున్నారు. లైన్ వేసే ప్రసక్తేలేదని భీష్మించి కూర్చున్నారు. ఒకదశలో పోలీసులకు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. లైన్ వేసే పనులు ముందుకు సాగకపోవడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఇదే సమయంలోనే జంగం సంతోష్ ఫోన్లో మాట్లాడుకుంటూ పొలం నుంచి ఇంటికొస్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు సంతోష్ను తీవ్రంగా చితకబాదారు. మరో 10 మందిపై లాఠీ ఝుళిపించారు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ను 108 అంబులెన్స్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. నలుగురు యువకులను పోలీసులు పోలీస్టేషన్కు తరలించారు. వారిని విడిచిపెట్టాలని గ్రామస్థులు మహిళలతో కలిసి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సహనం కోల్పోయిన పోలీసులు మరోసారి లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులను పోలీసు స్టేషన్కు తరలించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. కాగా ముత్యంపేట గ్రామస్తులపై అకారణంగా పోలీసులు లాఠీ చార్జి చేయడంపై వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందాడి విజయ భాస్కర్రెడ్డి తీవ్రంగా ఖండించారు.