బాల్య వివాహాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలో శుక్రవారం బాల్య వివాహం జరిగింది.
మంచిర్యాల : బాల్య వివాహాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలో శుక్రవారం బాల్య వివాహం జరిగింది. కాగా అంతకు ముందు బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి వధూవరుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి వెళ్లిపోగానే .... వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టి వివాహం జరిపించేశారు.
ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ ఐసిడిఎస్ సూపర్వైజర్ అక్కడికి చేరుకుని, మరోసారి వారికి బాల్యవివాహం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. బాలికకు యుక్త వయసు వచ్చేవరకూ కాపురానికి పంపించవద్దని ఇరు కుటుంబాలతో ఒప్పంద పత్రం రాయించుకున్నారు. ఎక్కడైనా ఇటువంటి బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే, వెంటనే తమకు సమాచారం అందించి, ఒక నిండు జీవితాన్ని కాపాడాలని ఐసీడీఎస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.