
‘ముంపు’ అధికారులను తెలంగాణకు బదిలీ చేయాలి
ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారులను..
సాక్షి, ఖమ్మం : ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారులను సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకుతూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు సోమవారం లేఖ రాశారు. ఈనెల 24న ముంపు మండలాల్లో తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తన పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నెల్లిపాక ఎంపీడీఓతో పాటు స్థానిక అధికారులపై దురుసుగా ప్రవర్తించడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
మహిళా అధికారి అని చూడకుండా సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించిన జేసీపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చింతూరు, కూనవరం, వీఆర్పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా ఆంధ్రలో వీలనమయ్యాయని, అయితే ఇక్కడ పనిచేసే స్థానిక అధికారులు మాత్రం తెలంగాణ రాష్ర్టంలోనే పనిచేసేందుకే మొగ్గుచూపుతున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిన ముంపు మండలాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి వివరాలు తనకు పంపాలని ఎంపీ ఆ జిల్లా కలెక్టర్ను లేఖ ద్వారా కోరారు.
మంత్రి హరీష్రావుకు లేఖ
జిల్లాకు సాగు నీటిని అందించే శ్రీరాంసాగర్, తానంచర్ల ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం లేఖ రాశారు. తానంచర్ల చెరువుకు సమీపంలో ఆకేరు నదిపై ఆనకట్ట నిర్మాణంతో 2,300 ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు.
ఫలితంగా తిరుమలాయపాలెం మండలంలోని జూపెడ, బచ్చోడు, మేడిదపల్లి, బీరోలు రైతులను కరువు కోరల నుంచి కాపాడవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈపనులు 60 శాతం పూర్తి అయ్యాయని మిగతా పనులు త్వరిగత గతిన పూర్తి చేసి సాగునీటిని అందించాలని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కొరతను సాకుగా చూపుతూ జాప్యం చేస్తున్నారన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి మండలాల్లోని 60,536 ఎకరాలకు సాగునీటి సమస్య తీరుందని వివరించారు. కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పనులు పూర్తిచేయించాలని కోరారు.