
జ్యోతి’ జీవితం చీకటిమయం
అభం, శుభం తెలియని ఆ చిన్నారికి అనుకోకుండా రెండు కాళ్లు చచ్చుబడి పోయి నడవలేకుండా మారింది.
► చిన్నారి కాళ్లు చచ్చుబడి పోయి ఇంటికే పరిమితం
► ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా నయం కాని వైనం
► అమెరికా వైద్యంతోనే నయమవుతుందంటున్న వైద్యులు
► ఆపన్న హస్తం అందించాలని తల్లిదండ్రుల వేడుకోలు
అందరిలా ఆడుకోవాలని.. పరిగెడుతూ పాఠశాలకు వెళ్లాలనీ.. చిన్నా చితకా పనులు చేస్తూ అమ్మకు సాయపడాలని ఆ చిన్నారి ఆశపడింది. కానీ చిన్ని ఆశ కలగానే మిగిలిపోయింది... వృద్ధులను రోడ్డు దాటించాలని, పలువురికీ సాయపడాలని బడిలో సార్లు చెప్తుంటే ఆ చిన్నారి కళ్లు చెమర్చాయి. ఇంకొకరి సాయం లేనిదే నిలబడలేని నేను వేరే వాళ్లకు ఎలా సాయం చేసేది అని.. పేరులో ఉన్న ‘జ్యోతి’ జీవితంలో లేదెందుకని కనిపించని దేవుళ్లనూ, కనిపెంచిన తల్లిదండ్రులనూ ప్రశ్నిస్తోంది.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఎవరో వస్తారని ఎదురుచూస్తోంది ఆ చిన్నారి కుటుంబం..
చెన్నూర్రూరల్ : అభం, శుభం తెలియని ఆ చిన్నారికి అనుకోకుండా రెండు కాళ్లు చచ్చుబడి పోయి నడవలేకుండా మారింది. ఎంతో హుషారుగా, చలాకీగా ఉండే ఆ చిన్నారి ఇంటికే పరిమితం అయ్యింది. చదువుతో పాటు, ఆటపాటల్లో ముందుండే చిన్నారి ఏమీ చేయలేని స్థితిలో పడిపోయింది. తన తోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూడటమే తప్ప కదల లేని స్థితిలో ఏడుస్తోంది. మండలంలోని కిష్టంపేట గ్రామంలోని ముంజెం సత్యనారాయణ, రాజేశ్వరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె రమ్య, చిన్న కుమార్తె జ్యోతి ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నారు. వీరిలో చిన్న కుమార్తె జ్యోతి జైపూర్ మండలంలోని భీమారంలో హాస్టల్లో ఉంటూ 5వ తరగతి వరకు చదివింది.
జ్యోతి చదువుతో పాటు ఆటల్లో ముందుండేంది. ఎంతో హుషారుగా ఉండేది. కానీ ఆ చిన్నారికి అనుకోకుండా పాఠశాల ముందు ఉన్న చిన్న బండరాయి తగిలి కాళ్లకు నొప్పులు వచ్చి సరిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. గమనించిన తల్లిదండ్రులు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన వైద్యులు జ్యోతికి వెన్నుపూసకు సంబంధించిన వ్యాది ఉందని, వెంటనే కరీంనగర్కు తీసుకువెళ్లాలని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కరీంగనర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ ైవె ద్యులు పరీక్షలు నిర్వహించి వెన్నుపూస సన్నబడి పోయి నరాలు లావు అయ్యాయని చెప్పారు. సుమారు 6 నెలల వరకు మందులు వాడాలని చెప్పారు. అయినా లాభం లేకుండా పోయింది.
కొద్ది, కొద్దిగా నడిచే చిన్నారి జ్యోతి కాళ్లు గత మూడు నెలలుగా పూర్తిగా పని చేయకుండా మారి నడవలేకుండా మారింది. దీంతో తమకున్న 3 గుంటల భూమి, తులం బంగారం అమ్ముకుని హైద్రాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు చిన్నారి జ్యోతికి పరీక్షలు నిర్వహించి అమెరికా నుంచి వచ్చే వైద్యులు మాత్రమే ఈ వ్యాధికి చికిత్సలు చేయగలుగుతారని నిర్ధరించి చెప్పారు. ఇప్పటికే బిడ్డ వైద్యం కోసం అందిన కాడ సుమారు రూ.2లక్షల వరకు అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించామని, ఆరోగ్యశ్రీ కూడా పని చేయడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటివరకు అప్పు చేసి మరీ వైద్యం చేయించామని ప్రస్తుతం పైసాకూడా తమ వద్ద లేక ఏం చేయాలో పాలుపోవడం లేదని జ్యోతి తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇంత ఖరీదైన వైద్యం చేయించే స్థోమత తమకు లేదని జ్యోతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉండే తమ కూతురును దీన స్థితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం జ్యోతికి పింఛన్ కూడా అందడం లేదు. ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని, ఎవరైనా దాతలు ఆపన్న హస్తం అందించి జ్యోతికి వైద్యాన్ని అందించాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.