కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీరే సీఎం | A.jeevan reddy prices D.K.aruna , mallu bhatti vikramarka | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీరే సీఎం

Mar 11 2017 3:49 AM | Updated on Oct 8 2018 9:21 PM

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీరే సీఎం - Sakshi

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీరే సీఎం

‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీ ఇద్దరిలో ఒకరు సీఎం అవుతారు. కాంగ్రెస్‌లో మిమ్మల్ని మించినవారెవరున్నారు..’

భట్టి, డీకేతో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీ ఇద్దరిలో ఒకరు సీఎం అవుతారు. కాంగ్రెస్‌లో మిమ్మల్ని మించినవారెవరున్నారు..’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీమంత్రి డి.కె.అరుణతో ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌) అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో వీరు ఎదురైన సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సర్వే ఫలితాలతో మీరు డల్‌గా కనబడుతున్నరు’ అని అన్నారు. ‘సర్వే ఏమిటి.. ఎవరు చేశారు?’ అని భట్టి ప్రశ్నించగా.. ‘ప్రభుత్వమే చేసింది కదా అన్నా’ అని జీవన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ‘ఓహో.. ప్రభుత్వం సర్వేలు కూడా చేస్తుందా..’ అని భట్టి ఎద్దేవా చేశారు.

ఇందుకు ‘అవునన్నా.. ప్రభుత్వమే చేసింది. టీఆర్‌ఎస్‌కు మంచి మార్కులు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్‌కు ఏమన్నా అవకాశం రావాలంటే మీ ఇద్దరు(భట్టి, డీకే అరుణ) తప్ప మీ పార్టీలో గొప్పవాళ్లెవరున్నరు’ అని జీవన్‌రెడ్డి అన్నారు. ‘ఎందుకు బాబూ మమ్ములను వివాదంలోకి లాగుతున్నారు. అయినా టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటే దళితులకు, మహిళలకు అవకాశం ఇవ్వరా..’ అని భట్టి ప్రశ్నించారు. అందుకు ‘నన్నెందుకున్నా మాట్లాడించి ఇబ్బందుల్లో పెడతారు? అయినా ఇక్కడ మీడియా వాళ్లున్నరు. వాళ్లు ఏదో ఒకటి రాస్తారు’ అని అంటూ జీవన్‌రెడ్డి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement