తమిళనాడులో కోవిడ్‌ దడ! | Sakshi
Sakshi News home page

తమిళనాడు: 50 వేలు దాటిన కేసులు

Published Wed, Jun 17 2020 7:49 PM

Coronavirus Tamil Nadu Positive Cases Toll Reaches 50000 Mark - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో కోవిడ్ దడ పుట్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అక్కడ 2,174 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,193కి చేరింది. బుధవారం ఒక్కరోజే అక్కడ 48 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 576కి చేరింది. తాజాగా కేసుల్లో ఒక్క చెన్నైలోనే 1276 నమోదయ్యాయి.
(చదవండి: ‘ఇద్దరు మనుమలనూ సైన్యంలోకి పంపుతా’)

కరోనాతో సీఎం పీఏ మృతి
కోవిడ్‌ బారినపడి ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సీఎం పళనిస్వామి వద్ద పీఏగా పనిచేస్తున్న దామోదరన్‌ రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

12 వేల మరణాలు..
ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల లెక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ.. రికవరీ రేటు సైతం  పెరుగుతుండటం సానుకూల పరిణామమని చెప్పొచ్చు. అయితే, కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య పెరగడం కలవరపరుస్తోంది. ఎప్పటిమాదిరిగానే కేసుల పరంగా.. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, డిల్లీ, గుజరాత్‌‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో 3,54,065 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 1,86,935 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 1,55,227 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 12 వేల మరణాలు చోటుచేసుకున్నాయి.
(చదవండి: మరోసారి లాక్‌డౌన్‌ ఉండదు)

Advertisement
Advertisement