‘పొడుగు బొట్లను చూస్తే భయమేస్తుంది’ | Siddaramaiah Controversial Comments In Badami Meeting About Kumkum Tikas | Sakshi
Sakshi News home page

‘పొడుగు బొట్లను చూస్తే భయమేస్తుంది’

Mar 6 2019 11:53 AM | Updated on Mar 6 2019 12:00 PM

Siddaramaiah Controversial Comments In Badami Meeting About Kumkum Tikas - Sakshi

బాదామి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో పలు వివాదాలు కేంద్ర బిందువుగా నిలిచిన ఆయన.. తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నుదిటిపై కుంకుమ బొట్టు, విభూది పెట్టుకునేవారిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య మంగళవారం బాదామిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అర్చకులు తొలుత పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రసంగించిన సిద్దరామయ్య.. నుదుటిపై పొడవాటి బొట్టు పెట్టుకున్న ఓ వ్యక్తిని చూపిస్తూ బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారు. 

‘నుదుటిపై పొడవైన కుంకుమ బొట్లు, విభూది పెట్టుకున్న వారిని చూసి నేను భయపడుతున్నాను. మీరు నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అయితే సక్రమంగా పని చేస్తారా?. ఎవరైనా సరే సకాలంలో వారికి కేటాయించిన పనిని సక్రమంగా పూర్తి చేయాలి. నుదిటిపై పొడవైన బొట్లు పెట్టుకున్నవారిని చూస్తే నాకు ఎందుకు భయమేస్తుందో అర్థం కావడం లేద’ని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు సిద్దరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement