వైద్యసమాచారంఇంటర్నెట్‌లో! | Medical information available in internet for poor patients | Sakshi
Sakshi News home page

వైద్యసమాచారంఇంటర్నెట్‌లో!

Oct 28 2013 11:53 PM | Updated on Oct 9 2018 7:52 PM

పేదలు, దారిద్య్రరేఖకు దిగువనున్న రోగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎప్పుడు వైద్యం అందజేస్తారనే వివరాలు త్వరలో ఇంటర్నెట్‌లో లభించనున్నాయి.

 సాక్షి, ముంబై:  పేదలు, దారిద్య్రరేఖకు దిగువనున్న రోగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎప్పుడు వైద్యం అందజేస్తారనే వివరాలు త్వరలో ఇంటర్నెట్‌లో లభించనున్నాయి. వెబ్‌సైట్లో వివరాల ప్రకారం పేదలు ఆయా ఆస్పత్రులకు వెళ్లి వైద్యం, ఇతర పరీక్షలు ఉచితంగా లేదా రాయితీ ధరలకు చేయించుకోవచ్చు. ముంబై, ఇతర ప్రధాన నగరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వాటిలో పేదల కోసం కొన్ని పడకలు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడ వారికి వైద్యం ఉచి తంగా లభించినా కొన్ని వైద్యపరమైన పరీక్షలు రాయితీ ధరకు నిర్వహించాలని కూడా సూచిం చింది. అదేవిధంగా ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లోనూ పేదలకు వైద్యం ఉచితం గా అందజేస్తున్నారు. ఏ ఆస్పత్రిలో, ఎలాంటి వ్యాధులకు, ఏరోజు ఉచితంగా వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయో పేదలు, అర్హులకు తెలియడం లేదు.

దీంతో వాటి వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదలకు ఈ వివరాలు ఇంటర్నెట్‌లో లభిం చేందుకు ‘ఆన్‌లైన్ రియల్‌టైం సిస్టం’ అనే పద్ధతిని అవలంభించాలని అన్ని ధర్మాదాయ ఆస్పత్రులకు ప్రభుత్వం సూచించింది. కొన్ని ప్రైవేటు ధర్మాదాయ ఆస్పత్రులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం అనేక ప్రైవేటు ఆస్పత్రులకు తక్కువ ధరలకు స్థలం అందజేయడం, వైద్య పరికరాలు, పన్ను, భవన నిర్మాణ సామగ్రిలో రాయితీ లు కల్పించింది. బదులుగా పేదలకు, దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలకు ఉచితంగా లేదా రాయితీలతో చికిత్సలు చేయాలని ఆదేశించింది. అయితే చాలా మంది ఈ విషయంపై అవగాహన ఉండడం లేదు. అందుకే ఏ ఆస్పత్రిలో పేదలకు ఎన్ని పడకలు కేటాయించారు? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ ఏ రోగానికి వైద్యం ఉచితంగా లభిస్తుంది ? తదితర వివరాలు లబ్ధిదారులందరికీ ఇంటర్నెట్ ద్వారా తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు పేదలకు కేటాయించిన పడకలను అక్రమంగా ఇతరులకు కేటాయించి నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇటు రోగి నుంచి, అటు ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
 ఇంటర్నెట్‌లో సమాచారం ఉంచడం వల్ల ఇలాంటి అక్రమాలకు కొంతమేరకైనా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఆస్పత్రుల వివరాలు కూడా బయటపడతాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement