విష్ణు–బాలాజీ జోడీకి టైటిల్‌ | Vishnu, Balaji pair got doubles titles | Sakshi
Sakshi News home page

విష్ణు–బాలాజీ జోడీకి టైటిల్‌

Feb 17 2018 10:07 AM | Updated on Feb 17 2018 10:07 AM

Vishnu, Balaji pair got doubles titles - Sakshi

చెన్నై: స్వదేశంలో ఈ ఏడాది జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ చెన్నై ఓపెన్‌లో విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ విష్ణు–బాలాజీ ద్వయం 7–6 (7/5), 5–7, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సెమ్‌ ఇల్కెల్‌ (టర్కీ)–డానిలో పెట్రోవిక్‌ (సెర్బియా) జోడీని ఓడించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం మూడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయినప్పటికీ... కీలకమైన సూపర్‌ టైబ్రేక్‌లో భారత జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్‌ కెరీర్‌లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. విజేతగా నిలిచిన భారత జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

ఫైనల్లో యూకీ

మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్‌), టాప్‌ సీడ్‌ జోర్డాన్‌ థాంప్సన్‌ (ఆస్ట్రేలియా) టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్స్‌లో యూకీ 7–5, 6–2తో డక్‌హీ లీ (కొరియా)పై, థాంప్సన్‌ 6–1, 7–6 (7/5)తో పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై గెలుపొందారు.   

Advertisement
 
Advertisement
Advertisement