
సౌమ్యజిత్ ‘డబుల్’ ధమాకా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన చిలీ ఓపెన్ చాలెంజ్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన చిలీ ఓపెన్ చాలెంజ్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సౌమ్యజిత్ ఘోష్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంతోపాటు సహచరుడు ఆంథోనీ అమల్రాజ్తో కలిసి డబుల్స్ విభాగంలోనూ టైటిల్ సాధించాడు. చిలీలోని సాంటియాగోలో ముగిసిన ఈ టోర్నీలో సింగిల్స్ ఫైనల్లో సౌమ్యజిత్ 8–11, 13–11, 11–6, 11–9, 4–11, 11–7తో ఆంథోనీ అమల్రాజ్ను ఓడించాడు.
డబుల్స్ ఫైనల్లో సౌమ్యజిత్–అమల్రాజ్ ద్వయం 13–11, 10–12, 14–12, 11–9తో ఫిలిప్ ఫ్లోరిట్జ్–హునోర్ జాక్స్ (జర్మనీ) జంటపై గెలిచింది. ఈ విజయంతో ఐటీటీఎఫ్ చాలెంజర్ సిరీస్లో విజేతగా నిలిచిన మూడో భారతీయ క్రీడాకారుడిగా సౌమ్యజిత్ గుర్తింపు పొందాడు. గతంలో భారత్ తరఫున శరత్ కమల్ (2010లో ఈజిప్టు ఓపెన్), జి. సత్యన్ (2016లో బెల్జియం ఓపెన్) ఒక్కోసారి ఐటీటీఎఫ్ చాలెంజర్ సిరీస్ టోర్నీల్లో విజేతగా నిలిచారు.