Soumyajith
-
సౌమ్యజిత్పై అత్యాచార ఆరోపణలు!
కోల్కతా: ప్రముఖ టేబుల్ టెన్నిస్ ఆటగాడు, ఒలింపియన్ సౌమ్యజిత్ ఘోష్ పెను వివాదంలో చిక్కుకున్నాడు. మూడేళ్ల క్రితం తనపై ఘోష్ అత్యాచారానికి పాల్పడ్డాడని 18 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యా దు చేసింది. అప్పట్లో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లిపై ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో విసుగెత్తి పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు చెప్పింది. సౌమ్యజిత్ ఘోష్పై అత్యాచారం (ఐపీసీ 376 సెక్షన్), మోసం (417 సెక్షన్), మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడం (313 సెక్షన్), మైనర్లపై లైంగికదాడి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సౌమ్యజిత్ను కామన్వెల్త్కు వెళ్లే బృందం నుంచి తప్పించింది. బెంగాల్కు చెందిన 24 ఏళ్ల సౌమ్యజిత్ 2013లో జాతీయ చాంపియన్గా నిలిచాడు. అదే ఏడాది బ్రెజి ల్ ఓపెన్ నెగ్గిన అతను 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో సింగిల్స్, డబుల్స్లో క్వార్టర్స్ చేరాడు. రెండు సార్లు (2012, 2016) ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. సౌమ్యజిత్కు అర్జున అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం జర్మనీలో శిక్షణ పొందుతున్న సౌమ్యజిత్ ఈ ఆరోపణల్ని కొట్టిపారేశాడు. ‘ఆమె నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతోనూ నాకు సత్సంబంధాలున్నాయి. మేమిద్దరం కలిసున్నాం. అయితే కెరీర్ కోసం ఆమె నుంచి దూరమవుతున్నట్లు చెప్పా. కానీ ఏడాదిన్నరగా ఆమె బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని’ సౌమ్యజిత్ వివరణ ఇచ్చాడు. -
సౌమ్యజిత్ ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన చిలీ ఓపెన్ చాలెంజ్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సౌమ్యజిత్ ఘోష్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంతోపాటు సహచరుడు ఆంథోనీ అమల్రాజ్తో కలిసి డబుల్స్ విభాగంలోనూ టైటిల్ సాధించాడు. చిలీలోని సాంటియాగోలో ముగిసిన ఈ టోర్నీలో సింగిల్స్ ఫైనల్లో సౌమ్యజిత్ 8–11, 13–11, 11–6, 11–9, 4–11, 11–7తో ఆంథోనీ అమల్రాజ్ను ఓడించాడు. డబుల్స్ ఫైనల్లో సౌమ్యజిత్–అమల్రాజ్ ద్వయం 13–11, 10–12, 14–12, 11–9తో ఫిలిప్ ఫ్లోరిట్జ్–హునోర్ జాక్స్ (జర్మనీ) జంటపై గెలిచింది. ఈ విజయంతో ఐటీటీఎఫ్ చాలెంజర్ సిరీస్లో విజేతగా నిలిచిన మూడో భారతీయ క్రీడాకారుడిగా సౌమ్యజిత్ గుర్తింపు పొందాడు. గతంలో భారత్ తరఫున శరత్ కమల్ (2010లో ఈజిప్టు ఓపెన్), జి. సత్యన్ (2016లో బెల్జియం ఓపెన్) ఒక్కోసారి ఐటీటీఎఫ్ చాలెంజర్ సిరీస్ టోర్నీల్లో విజేతగా నిలిచారు.