ఆడాలా వద్దా అనేది ధోని ఇష్టం

Ravi Shastri Commented About MS Dhoni That He Decide Whether To Come Back Or Not - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని జట్టుకు అందుబాటులో ఉండడమనేది అతను క్రికెట్‌ ఆడతాడా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుందని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు అందుబాటులో లేని ధోని రానున్న బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. కాగా, మాజీ కెప్టెన్‌ తిరిగి ఎప్పుడు ఆడాలనుకుంటున్నాడనే విషయమై అతనే నిర్ణయం తీసుకోవాలని, అలాగే భవిష్యత్తు ప్రణాళికపైనా సెలక్టర్లకు సమాచారం అందిస్తే బాగుంటుందని రవిశాస్ర్తి అభిప్రాయపడ్డారు. అలాగే ధోని రిటైర్మంట్‌పై వస్తున్న ఉహాగానాలపై శాస్త్రి స్పందిస్తూ.. తాను ప్రపంచకప్‌ తర్వాత ధోనిని కలవలేదని, మొదట అతను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాలని, ఆ తర్వాత ఏం జరిగేదుంటే అది జరుగుతుందని తెలిపారు. అతడికి తిరిగి జట్టులోకి రావాలనిపిస్తే అది ధోని ఇష్టమని, ఆ నిర్ణయం అతనికే వదిలేస్తామన్నారు.

అలాగే టెస్టుల్లో రిషబ్‌పంత్‌ను కాదని వృద్దిమాన్‌ సాహాను ఎంపిక చేయడం వెనుక కారణాన్ని శాస్ర్తి వివరించాడు. గతేడాది జనవరిలో బెంగాల్ వికెట్‌కీపర్‌ గాయపడడం వల్లే పంత్‌కు అవకాశమొచ్చిందని పేర్కొన్నాడు. సాహా టెస్టుల్లో ఇప్పటికే మంచి నైపుణ్యం కలిగిన బ్యాట్సమెన్‌గా గుర్తింపు సాధించాడని, అలాగని పంత్‌ను తక్కువ చేసి చూడట్లేదని తెలిపాడు. ఇంగ్లండ్‌, ఆస్ర్టేలియాలతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో సెంచరీలతో ఆకట్టుకున్న పంత్‌ ఇంకా యువకుడే కావడంతో అతనికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని శాస్ర్తి చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top