లేజర్‌ స్టాండర్డ్‌లో జితేశ్‌ ఆధిపత్యం | Jitesh Leads in Sailing Championship | Sakshi
Sakshi News home page

లేజర్‌ స్టాండర్డ్‌లో జితేశ్‌ ఆధిపత్యం

Jul 4 2019 1:57 PM | Updated on Jul 4 2019 1:57 PM

Jitesh Leads in Sailing Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ జలాల్లో సందడి చేస్తోన్న ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌లో జితేశ్‌ (ఆర్మీ యాటింగ్‌ నాడ్‌–ఏవైఎన్‌) తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించాడు. లేజర్‌ స్టాండర్డ్‌ ఈవెంట్‌లో బుధవారం మూడు రేసులు జరుగగా... రెండింటిలో జితేశ్‌ విజేతగా నిలిచాడు. మొదటి, మూడు రేసుల్లో అగ్రస్థానాన్ని జితేశ్‌ అందుకోగా, రెండో రేసులో జితేశ్‌ను వెనక్కినెట్టి ముజాహిద్‌ ఖాన్‌ తొలి స్థానంలో నిలిచాడు. లేజర్‌ రేడియల్‌ విభాగంలోనూ ఏవైఎన్‌ క్రీడాకారుల హవా కొనసాగింది. రేడియల్‌ తొలి రేసులో హర్‌ప్రీత్‌ సింగ్, రెండో రేసులో జితేశ్‌ గెలుపొందారు. లేజర్‌ 4.7 తొలి రెండు రేసుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఆశిష్‌ విశ్వకర్మ, రమిలాన్‌ యాదవ్‌.. మూడో రేసులో టీఎస్‌ఈ సెయిలర్‌ సిఖాన్షు సింగ్‌ గెలుపొందారు.

470 క్లాస్‌ ఈవెంట్‌ను ఏవైఎన్‌ సెయిలర్లు హస్తగతం చేసుకున్నారు. తొలి రేసును అతుల్‌–సీహెచ్‌ఎస్‌ రెడ్డి, రెండో రేసును పీపీ ముత్తు–ఎస్‌సీ సింఘా, మూడో రేసును పీపీ ముత్తు–ఎస్‌సీ సింఘా గెలుచుకున్నారు. ఆర్‌ఎస్‌:ఎక్స్‌ విభాగం తొలి రేసును ఈఎంఈఎస్‌ఏ సెయిలర్‌ డేనీ కోయిలో గెలుపొందాడు. రెండు, మూడు రేసుల్లో ఏవైఎన్‌ క్రీడాకారులు వరుసగా మన్‌ప్రీత్‌ సింగ్, జెరోమ్‌ కుమార్‌ నెగ్గారు. ఫిన్‌ విభాగంలో మూడు రేసుల్లో వరుసగా స్వతంత్ర సింగ్‌ (ఏవైఎన్‌), జస్వీర్‌ సింగ్‌ (ఏవైఎన్‌), ఎంకే యాదవ్‌ (ఏవైఎన్‌) విజేతలుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement