ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి..

Published Tue, Apr 10 2018 11:00 PM

First time in ipl History KKR gets 200 mark after losing 5 wickets less than 100 runs - Sakshi

చెపాక్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ 202 పరుగులను సాధించడంతో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. వంద పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి రెండొందల మార్కును చేరడంతో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది.  ఒక జట్టు వంద పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి రెండొందల పరుగులకు పైగా చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2008లో డెక్కన్‌ చార్జర్స్‌ 95 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి చివరకు 181 పరుగులు చేసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ చార్జర్స్‌ ఆ ఘనత సాధించింది. ఆపై 2015లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సందర్భంలో 180 పరుగుల్ని  స్కోరు బోర్డుపై ఉంచింది.  

ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా, నిర్ణీత ఓవర్లలో 202 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆండ్రీ రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్‌ 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్‌తో 88  పరుగులు సాధించి చివరి వరకూ అజేయంగా నిలిచాడు.  26 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ సాధించిన రసెల్‌.. ఆపై మరింత దూకుడుగా ఆడాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించి రెండొందల మార్కును దాటించాడు.

Advertisement
Advertisement