
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ప్రస్తుతానికి ఆరు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్..కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దాంతో రోహిత్ అండ్ గ్యాంగ్ ఇక నుంచైనా తమ ఆట తీరులో మార్పు రావాలని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఆటగాళ్లకు హితబోధ చేశాడు.
‘మేము గాడిలో పడతామని అనుకుంటాన్నా. ఇది జరగాలంటే మా ఆటగాళ్లు భయపడకుండా క్రికెట్ ఆడాలి. ఎప్పుడైతే ఫియర్లెస్ క్రికెట్ ఆడతామో అప్పుడే మన నుంచి అసలు ఆట బయటకొస్తుంది. నేను మా జట్టు నుంచి ఆశించేది ఇదే. ఇప్పటికైనా సమష్టి ప్రదర్శనతో ముందుగా సాగుదాం’ అని రోహిత్ పేర్కొన్నాడు. శనివారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.