పంత్‌.. పోయి పిల్లలతో ఆడుకో

Fans Fire On Pant After Flop Show in Bengaluru T20 Against South Africa - Sakshi

ఎన్నో అంచనాలతో అవకాశం ఇచ్చారు. కానీ ఆకట్టుకోలేదు. అనుభవం లేదు కదా.. పోనీలే నేర్చుకుంటాడని ఓపిగ్గా ఎదురుచూశారు. ఐనా తీరు మార్చుకోలేదు. సర్లే ఈ సిరీస్‌ కాకపోతే మరో సిరీస్‌ అంటూ ఎదురుచూశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అతడి ఆటపై కోచ్‌ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినా.. బ్యాటింగ్‌ కోచ్‌ కూడా షాట్‌ సెలక్షన్స్‌ అసహనంగా ఉన్నా.. ప్రత్యామ్నాయం వెతుకుతున్నామంటూ చీఫ్‌ సెలక్టర్‌ ప్రకటించినా.. రిషభ్‌ పంత్‌ది అదే నిర్లక్ష్యం.. అంతే తొందరపాటు. 

బెంగళూరు : క్రికెట్‌లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు.  ప్రస్తుతం టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్‌ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మకమైన చివరి టీ20లోనూ పంత్‌(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే సువర్ణావకాశాన్ని పంత్‌ నేలపాలు చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. పేలవ షాట్‌తో మరోసారి అవుటై విమర్శలపాలవుతున్నాడు. దీంతో సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు పంత్‌పై మండిపడుతున్నారు. 

బుమ్రా, సైనీల కంటే దారుణం.. 
రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ జస్ప్రిత్‌ బుమ్రా, నవదీప్‌ సైనీల కంటే దారుణంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక బేబీ సిట్టర్‌గా మంచి పేరున్న పంత్‌ క్రికెట్‌ను వదిలి పిల్లలతో ఆడుకుంటే మంచిదని మండిపడుతున్నారు. సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా పంత్‌కు పదేపదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఎక్కువ సమయం లేనందున పంత్‌పై కఠిన నిర్ణయం తీసుకోవాలని మరికొంత మంది నెటిజన్లు సూచిస్తున్నారు. ఇక చివరి పది టీ20ల్లో పంత్‌ 149 పరుగులే సాధించాడని, ఇందులో రెండు మ్యాచ్‌ల్లో పరుగులేమి చేయలేదని, ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడని గుర్తుచేస్తున్నారు. గురువారం మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. 

పంత్‌ ఆడి ఉంటేనా..
గురువారం మ్యాచ్‌లో పంత్‌ ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. టాపార్డర్‌ విఫలమవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అప్పటికీ ఎనిమిది ఓవర్లు కూడా పడలేదు. దీంతో పంత్‌ క్రీజులో నిలదొక్కుకొని ఆడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో ఫార్చూన్‌ బౌలింగ్‌లో అవుట్‌సైడ్‌ ఆఫ్‌ బంతిని వెంటాడి మరి గాల్లోకి లేపాడు. దీంతో లాంగాఫ్‌లో పీల్డింగ్‌ చేస్తున్న ఫెలూక్వాయో క్యాచ్‌ అందుకోవడంతో పంత్‌ పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం శాంసన్‌కు మద్దతు పెరుగుతున్న క్రమంలో పంత్‌కు మరోసిరీస్‌ అవకాశం ఇచ్చే ధైర్యం సెలక్టర్లు చేస్తారో వేచి చూడాలి. 

చదవండి: 
‘రిషభ్‌పై అంత ప్రేమ అవసరం లేదు’
‘పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాం’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top