క్వార్టర్స్‌లో దివిజ్‌–బోపన్న జంట

Divij -Bopanna pair enter to quarter final - Sakshi

పుణే: టాటా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్‌ దివిజ్‌ శరణ్‌–రోహన్‌ బోపన్న (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌–బోపన్న ద్వయం 6–1, 6–2తో రాడూ అల్బోట్‌ (మాల్డోవా)–మాలిక్‌ జజిరీ (ట్యూని షియా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంట నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది.

మరో మ్యాచ్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–మిగుయెల్‌ వరేలా (మెక్సికో) ద్వయం 6–3, 6–4తో మరేరో (స్పెయిన్‌)–కాస్టిలో (చిలీ) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లో దివిజ్‌–బోపన్న జోడీతో పోరుకు సిద్ధమైంది. సింగిల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్‌ రామనాథన్‌ ముందంజ వేయగా... అర్జున్‌ ఖడే  నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో రామ్‌కుమార్‌ 4–6, 6–4, 6–3తో మార్సెల్‌ గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)పై నెగ్గగా... అర్జున్‌ ఖడే 5–7, 6–7 (6/8)తో లాస్లో జెరీ (సెర్బియా) చేతిలో ఓడిపోయాడు. క్వాలిఫయింగ్‌ నుంచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని కాలి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top