
న్యూఢిల్లీ: అబుదాబి మాస్టర్స్ చెస్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువతార ఎరిగైసి అర్జున్ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. బుధవారం అబుదాబిలో జరిగిన రెండో గేమ్లో అర్జున్ 36 ఎత్తుల్లో భారత్కే చెందిన రక్షితపై గెలుపొందాడు. తొలి రౌండ్లో అర్జున్ 34 ఎత్తుల్లో దుష్యంత్ శర్మను ఓడించాడు. తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి, రాజా రిత్విక్ విశేష ప్రతిభ కనబరిచారు.
తొలి రౌండ్లో మిచెల్లి కాథరీనాపై రాజా రిత్విక్ గెలిచి... రొమేనియా గ్రాండ్మాస్టర్ కాన్స్టన్టిన్తో జరిగిన రెండో గేమ్ను ‘డ్రా’గా ముగించడం విశేషం. మరోవైపు మూడో జీఎం నార్మ్ సాధించాలనే పట్టుదలతో ఉన్న హర్ష తొలి రౌండ్లో లియోన్ ల్యూక్ను ఓడించి... అర్మేనియా గ్రాండ్మాస్టర్ గాబ్రియేల్ సర్గాసియాన్తో జరిగిన రెండో గేమ్ను 49 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ లలిత్ బాబు తొలి గేమ్లో వంతిక అగర్వాల్పై గెలిచి... రాహుల్తో జరిగిన రెండో గేమ్ను ‘డ్రా’గా ముగించాడు.