బీసీల కుటుంబాల్లో వెలుగులు నింపి తీరతా: వైఎస్ జగన్
బీసీ ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్
బీసీ కమిటీ ఏర్పాటు.. ప్రజల సలహాల స్వీకరణ
పాదయాత్ర ముగిశాక బీసీ గర్జన
సాక్షి, మైదుకూరు : ఏడో రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలోని కానగూడూరులో బీసీ సంఘాలతో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారి విజ్ఞప్తులు, సలహాలు స్వీకరించారు. ఆయన అక్కడ హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
దివంగత నేత వైఎస్సార్ సువర్ణ యుగాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ హాజరైన జనవాహినికి విజ్ఞప్తి చేశారు. యాదవ సోదరులందరు ఒక్కటే అడుగుతున్నా... వైఎస్ఆర్ హయాంలో గోర్రెలు, మేకలు చనిపోతే ఇన్సూరెన్స్ ఉండేదని.. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? అనగానే.. లేదు అన్న సమాధానం ప్రజల నుంచి వినిపించింది. ఈ నాలుగేళ్లలో ఒక్క ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేకపోయారని.. జీవనోపాధి కోల్పోయిన వారి జీవితాల గురించి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చెయ్యట్లేదని జగన్ చెప్పారు.
బీసీలు పేదకరికం నుంచి బయటపడాలంటే.. వారి కుటుంబంలోని పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని దివంగత నేత వైఎస్ఆర్ కలలు గన్నారని.. అందుకే ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు చేశారన్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఫీజులు లక్షల్లో ఉంటే వేలలో ఫీజును అది కూడా ఏడాది తర్వాత చెల్లిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని జగన్ పేర్కొన్నారు. పైగా ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఆస్తులు, భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
అధికారంలోకి రాగానే ఉన్నత చదువులు చదివే ప్రతీ విద్యార్థికి పూర్తి ఫీజును రీఎంబర్స్మెంట్గా చెల్లిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ఇంకా ఆయనేం చెప్పారంటే.. విద్యార్థుల ఖర్చుల కోసం ఏటా 20 వేల నగదు ఇస్తాం. అమ్మ ఒడి పథకం సమర్థవంతంగా అమలు చేసి తీరతాం. తమ పిల్లలను బడికి పంపించే ప్రతీ తల్లి అకౌంట్ లో 15 వేలు వేస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో బీసీ కమిటీని ఏర్పాటు చేసి, ప్రతీ నియోజకవర్గంలో పర్యటించి ప్రజల నుంచి సలహాలు స్వీకరించి నివేదిక సమర్పించాలని కోరతాం. పాదయాత్ర పూర్తయ్యాక ఆ నివేదిక ఆధారంగా బీసీ గర్జన ఏర్పాటు చేసి.. బీసీ డిక్లరేషన్ చేస్తానమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ విధానం అమలు చేస్తామన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, 45 ఏళ్లకే ఫించన్ పథకం, అమ్మ ఒడి పథకం ప్రస్తుతం నా ఆలోచనల్లో ఉన్నాయి. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని ప్రకటించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామన్నారు. జన్మభూమి కమిటీల్లాగా కాకుండా లబ్దిదారులను స్థానికంగానే ఎంపిక చేసి అందరికి సభ్యత్వం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత పలువురి సలహాలు, సూచనలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు.