చంద్రబాబూ.. ఇక డైపర్లు వేసుకొని తిరుగు!
ట్విటర్లో విజయసాయి రెడ్డి ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్ : పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజల పాదాల కింద చంద్రబాబు ఇసుక కోటలు.. ఆనవాళ్లు లేకుండా చెదిరిపోయాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. బందిపోటు రాజకీయ చరిత్రకు ముగింపు పలికిన ఆంధ్రప్రజలకు యావత్త్ దేశం జేజేలు పలుకుతోందన్నారు. చంద్రబాబు ఇక డైపర్లు వేసుకోని తిరగాలని, లేకుంటే లీకయి పరువుపోతుందని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు చేసిన కుట్రలపై ధ్వజమెత్తారు.
నియంతలు పాలించిన దేశాల్లో కూడా ఎన్నికల్లో ఇన్ని అరాచకాలు జరిగి ఉండవన్నారు, వేల కోట్లు వెద జల్లినా.. తమిళనాడు మద్యం అంతా ఆంధ్రాకి దారి మళ్లించినా, వైఎస్సార్ సానుభూతి పరుల ఇళ్లకు మంచి నీళ్లు వెళ్లకుండా పైపులైన్లను ధ్వంసం చేసినా...ప్రజా ప్రభంజనాన్ని చంద్రబాబు అడ్డుకోలేక పోయారన్నారు. పోలింగును అడ్డుకునేందుకు చంద్రబాబు రౌడీ మూకలను ఉసిగొల్పారని, అనేక చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు భద్రత కల్పించకున్నా.. ప్రజలే రక్షణ వలయంలా నిల్చుని కాపాడుకున్నారని తెలిపారు. ప్రజాతీర్పు నిక్షిప్తమైపోయిందని, నారాసుర పాలన అంతమైందని జనాలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు.
నీచపు పనులన్నీ చేసి పత్తిత్తులా..
ప్రతి నియోజక వర్గంలో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, అయినా తమ కార్యకర్తలు సంయమనం పాటించారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నీచపు పనులన్నీ చేసి పత్తిత్తులాగా చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. జైలుకు వెళ్తానన్న భయంతో రౌడీలా ప్రవర్తిస్తున్నారని, పోలింగు రోజు కూడా టిడిపి, పచ్చమీడియా కుట్రలు మానలేదన్నారు. ఉత్సాహంగా ఓటు వేద్దామని వెళ్లిన ప్రజలను వెనక్కి మళ్లించేందుకు ఓటింగ్ మిషన్లు పనిచేయడం లేదని పుకారు లేపారన్నారు. చంద్రబాబు కుల టీవీలన్నీ ఈవీఎంలపై నానా యాగీ చేశాయన్నారు.