దోపిడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు: పవన్
సాక్షి, శ్రీకాకుళం : ఎక్కడ అయితే దోపిడి, దౌర్జన్యాలు ఉంటాయో అక్కడే ఉద్యమం ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జిల్లాలోని కాశీబుగ్గలో మంళగవారం నిర్వహించినలో పవన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం త్రికరణశుద్ధితో పోరాటం చేస్తున్నానని అన్నారు. శ్రీకాకుళం ఉద్యమ నేల అని, అందుకే ఇక్కడి నుంచే పోరాటం ప్రారంభించానని చెప్పారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
కిడ్నీ సమస్యలపై అమెరికా నుంచి డాక్టర్లను తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పరిచయం చేశాను.. కానీ ప్రయోజనం లేదని పవన్ తెలిపారు. మత్స్యకారులకు క్రాప్ హాలిడే సమయంలో కూడా ప్రభుత్వం రూ.2 వేల భృతి ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. టీడీపీ నేతలు భూకబ్జాలకు, దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై జనసేన పార్టీ చేతులు కట్టుకొని కూర్చోదని, ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు.
తాను టీడీపీకి మద్దతు ఇస్తే.. 19 ఏళ్ల జనసేన కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో దోపిడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయండని పవన్ ప్రజలను కోరారు. జీడీ పరిశ్రమ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా పలాసాకు ఓపెన్ యూనివర్సిటీ కావాలని డిమాండ్ చేశారు. ఉద్దానానికి ప్రత్యేక నిధులు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని, విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని జనసేన నిరసన కవాతు ద్వారా కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు.