ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్‌ జహాన్‌ | Nusrat Jahan slams trolls for sindoor remarks | Sakshi
Sakshi News home page

ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్‌ జహాన్‌

Jun 30 2019 5:03 AM | Updated on Jun 30 2019 5:03 AM

Nusrat Jahan slams trolls for sindoor remarks - Sakshi

లోక్‌సభ సభ్యురాలిగా పార్లమెంటులో ప్రమాణం చేస్తున్న నుస్రత్‌ జహాన్‌ (ఫైల్‌)

న్యూఢిల్లీ: హిందువులు ధరించే సిందూరాన్ని పెట్టుకొని, చీర ధరించి ఇటీవల పార్లమెంట్‌లో గత నెల ప్రమాణస్వీకారం చేసినందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ను నెటిజన్లు ట్రోల్‌ చేయగా ఆమె వాటికి ట్విటర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారు. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సిందూరాన్ని ధరించానని ధీటుగా జవాబిచ్చారు. అది మతం, కులం, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని తెలిపారు.

ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, నుస్రత్‌ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించిందని అన్నారు. సహారాన్పూర్‌లోని జమీమా షేక్‌ ఉల్‌ హింద్‌కు చెందిన మత పెద్ద అసద్‌ క్వాస్మి మాట్లాడుతూ ఇస్లాంలో ఇతర మతాల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధమన్నారు. అయిప్పటికీ ఆమె జైన్‌ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని అన్నారు. సిందూరం ధరించడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి అని తనకు తెలిసిందని, సినిమా రంగంవారు మత సంప్రదాయాలను పాటించరన్నారు. ఆమెను తమ మతంలోకి ఆహ్వానిస్తున్నామని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ అన్నారు. భవిష్యత్తు తమ మతంతోనే సురక్షితంగా ఉందని, హిందూ మతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్‌ గుర్తించిందన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement