అందుకే సీఎం అని మాట్లాడాను : రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Raj Gopal Reddy Response On Audio Call Leak - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపేందుకే తాను పార్టీ మారుతున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నయం అని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా ఎవరిని తీసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్‌ బతికే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. తన కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే సీఎం అని మాట్లాడినట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్న రాజగోపాల్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనను బీజేపీలోకి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరినట్టు వెల్లడించారు. ఈ విషయంపై రాం మాధవ్‌ను కలిసి చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన టీపీసీసీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. తనకు షోకాజ్‌ ఇచ్చే నైతిక అధికారం టీపీసీసీకి లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ ఒక మునిగిపోయే నావ అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం సరిగా లేదని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ను కొనసాగించడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. బీజేపీలో ఎలా చేరాలనే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. రానున్న జమిలి ఎన్నికలతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

చదవండి : బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top